PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ

  • దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం
  • తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
  • పర్యావరణహిత, కాలుష్యరహిత రవాణా వ్యవస్థగా రికార్డ్
Modi1

Modi1

భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు త్వరలో హర్యానా నుంచి పట్టాలెక్కనుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. పర్యావరణహిత, కాలుష్యరహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా భారతీయ రైల్వే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఈ హైడ్రోజన్ రైలు పూర్తిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. డీజిల్‌కు బదులుగా హైడ్రోజన్‌ను ఇంధనంగా వినియోగించడం వల్ల కార్బన్ ఉద్గారాలు దాదాపు ఉండవు. దీంతో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ రైలు దోహదపడనుంది.

జూలై 17న ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ రైలు ప్రారంభం కానుంది. హర్యానాలోని జింద్–సోనిపట్ రైల్వే మార్గంలో ఈ హైడ్రోజన్ రైలును ప్రయోగాత్మకంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవంతమైతే దేశంలోని ఇతర రూట్లలో కూడా ఇలాంటి హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.

భారతీయ రైల్వే ఇప్పటికే నెట్ జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యంతో పలు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అమలు చేస్తోంది. వాటిలో భాగంగానే ఈ హైడ్రోజన్ రైలు ప్రాజెక్టును చేపట్టింది. దీంతో భారత్ ప్రపంచంలోని హైడ్రోజన్ రైలు సాంకేతికతను వినియోగిస్తున్న దేశాల జాబితాలో చేరనుంది. గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు నడవనుంది.

ప్రధాని పంచుకున్న చిత్రాలు

ప్రధానమంత్రి మోడీ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో హైడ్రోజన్ రైలు చిత్రాలను పోస్ట్ చేస్తూ.. ‘‘భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు హర్యానా నుంచి ప్రారంభం కాబోతోంది.’’ అని రాశారు. ఆయన పోస్ట్ ఈ ప్రాజెక్ట్‌పై ఉత్సాహాన్ని రేకెత్తించింది. భవిష్యత్తులో మరో 35 హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది.

ప్రత్యేకత ఏమిటి?

ఈ కొత్త రైలులో 10 కోచ్‌లు ఉంటాయి. హైడ్రోజన్‌తో నడిచే DEMU సెట్‌గా రూపొందించారు. ఇందులో 682 సీట్లు ఉండగా.. మొత్తం 2,600 మంది ప్రయాణీకులను తీసుకువెళ్లే సామర్థ్యం ఉంటుంది. పరీక్షల సమయంలో ఈ రైలు అధిక వేగాన్ని అందుకున్నప్పటికీ, సాధారణ కార్యకలాపాల కోసం దీని గరిష్ట వేగాన్ని గంటకు 75 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ అయినందున.. దీని ప్రారంభాన్ని జాగ్రత్తతో కూడిన పద్ధతిలో నిర్వహిస్తున్నారు.

మీడియా నివేదికల ప్రకారం.. హైడ్రోజన్ రైళ్లు మొబైల్ పవర్ ప్లాంట్లలా పనిచేస్తాయి. ఫ్యూయల్ సెల్‌లో హైడ్రోజన్ వాయువును, బయటి వాతావరణంలోని ఆక్సిజన్‌ను కలుపుతారు. ఈ రసాయన ప్రక్రియ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇది రైలులోని ఎలక్ట్రిక్ మోటార్లకు శక్తినిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఎలాంటి హానికరమైన పొగలు వెలువడవు. బదులుగా కేవలం నీటి ఆవిరి, డి మాత్రమే ఉత్పత్తి అవుతాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రైళ్ల ముఖ్య ఉద్దేశం రైల్వే నెట్‌వర్క్‌ను డీకార్బనైజ్ చేయడం. ముఖ్యంగా ఓవర్‌హెడ్ పవర్ లైన్లు వేయడం కష్టంగా లేదా అత్యంత ఖరీదైనదిగా ఉన్న మార్గాలలో హైడ్రోజన్ రైళ్లు పెద్ద మౌలిక సదుపాయాలు అవసరం లేకుండానే ఎలక్ట్రిక్ రైళ్ల మాదిరిగానే పర్యావరణ ప్రయోజనాలను అందిస్తాయి. డీజిల్ రైళ్లలాగే నిమిషాల్లో ఇంధనం నింపుకుని నడపవచ్చు.