PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..

  • పరీక్షల వ్యవస్థ సంస్కరణలకు హైపవర్ టాస్క్ ఫోర్స్ ప్రకటించిన ప్రధాని మోదీ.
  • ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి కమిటీకి ఛైర్మన్.
  • పరీక్షల పారదర్శకత, సాంకేతిక భద్రత, విశ్వసనీయతపై సిఫార్సులు.
Pm Modi (1)

Pm Modi (1)

PM Modi: భారతదేశ పరీక్ష విధానంలో సంస్కరణకు ప్రధాని నరేంద్రమోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ఆదివారం ప్రకటించారు. ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ప్రధాని ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నవారు ఇప్పుడు జైలులో ఉన్నారని ఆయన అన్నారు.

పరీక్షలకు సంబంధించిన అవకతవకలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇప్పటికే ‘‘ఫాస్ట్ కోడ్’’ ప్రవేశపెట్టిందని, పార్లమెంట్‌లో కఠిన నిబంధనలతో కూడిన కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు చెప్పారు. దీర్ఘకాలిక సంస్కరణల ఆవశ్యకతను నొక్కిచెబుతూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా ఉపయోగించుకుంటూనే, పరీక్షా వ్యవస్థను మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా మార్చడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ప్రధాని అన్నారు.

నందన్ నీలేకని నేతృత్వంలో ఏర్పడిన టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి పెడుతుందని, వీలైనంత త్వరగా సిఫారసుల్ని సమర్పిస్తుందని, . రాబోయే పరీక్షల విశ్వసనీయతను నిర్ధారించడానికి ప్రభుత్వం ఈ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందని మోడీ చెప్పారు.