PM Modi: ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పిస్తూనే, ఇటీవల ఆందోళన, నిరసనల విషయంలో కూడా పరోక్షంగా స్పందించారు. ముఖ్యంగా యువత, జెన్-జీని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. దేశాభివృద్ధిపై ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మరోసారి మోడీ ‘‘దిమాగీ నక్సల్స్’’ పదాన్ని ఉపయోగించారు. ఇటీవల ఎర్రకోటపై నుంచి మోడీ మాట్లాడుతూ.. దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని ఉపయోగించారు.
‘‘ఎర్రకోట నుంచి నేను ‘దిమాగీ నక్సల్’ అనే హోమియోపతి పిల్ ఇచ్చాను. హోమియోపతిలో చికిత్స ప్రారంభించినప్పుడు మొదట్లో వ్యాధి తీవ్రత పెరిగినట్లు కనిపిస్తుంది. అదే విధంగా నేను ‘దిమాగీ నక్సల్’ పిల్ ఇవ్వగానే ఒక్కొక్కరుగా బయటకు రావడం ప్రారంభించారు. ఇప్పుడు వారిని ప్రోత్సహిస్తున్నవారి నిజస్వరూపాన్ని కూడా ప్రజలు చూస్తున్నారు’’ అంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. SRCCలో 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను చేసిన ప్రసంగాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు. 13 ఏళ్ల తర్వాత ప్రధాని హోదాలో మళ్లీ వచ్చిన తర్వాత అప్పటికీ, ప్రస్తుత భారత్కు తేడాలను విద్యార్థుల ముందుంచారు.
కేదార్నాథ్ విషాదాన్ని, 2008 ఆర్థిక సంక్షోభాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావించారు. కేదార్నాథ్ విపత్తు సమయంలో అప్పటి ప్రభుత్వం తడబడిందని విమర్శించారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేదని, బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురైందని అన్నారు. కరోనా మహమ్మారి నుంచి పశ్చిమాసియా సంక్షోభం వరకు ప్రతీ అంశాన్ని విద్యార్థుల ముందుంచారు. అనేక ప్రపంచ సంక్షోభాల సమయంలో భారత్ అద్భుతంగా మనుగడ సాధించిందని చెప్పారు. జెన్-జీతో కనెక్ట్ అయ్యేలా ప్రధాని మోడీ వారి భాషలోనే మాట్లాడారు. వారిని ఆకట్టుకునేందుకు జెన్-జీ పదాలను ఉపయోగించారు.

