నిత్యావసర ధరలు పెరగబోతున్నాయా? పెట్రోల్, డీజిల్ ధరలు షాకివ్వనున్నాయా? వాహనదారులపై భారీ వడ్డన పడనుందా? డొమిస్టిక్ గ్యాస్ ధర పెంపుతో వంటింట్లో మంట పుట్టించనుందా? తాజా పరిణామాలను చూస్తే అవుననే సమాధానం వస్తోంది.
ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆదివారం హైదరాబాద్ వేదికగా జరిగిన సభలోనూ.. సోమవారం వడోదర వేదికగా జరిగిన సభలోనూ ప్రధాని మోడీ కీలక పిలుపునిచ్చారు. దేశ ప్రజలంతా పొదుపు మంత్రం పాటించాలని కోరారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన పరిణామాల నేపథ్యంలో కోవిడ్ తరహాలో కఠిన నిబంధనలు పాటించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లుగా మోడీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.
కేబినెట్ సమావేశంలో ఇంధన ధరల పెంపు, వర్క్ ఫ్రమ్ హోమ్పై ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆయిల్ సంస్థలు ఇప్పటికే రోజుకి వెయ్యి కోట్ల నష్టం ఎదుర్కొంటున్నాయి. లక్ష కోట్లు నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంధన ధరలు పెంచాలని ఆయిల్ సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఇక ఇంధన ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి. సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, ప్యాక్ చేసిన ఆహారాలు, పానీయాలు వంటి రోజువారీ గృహోపకరణ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారే అవకాశం ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇక ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయవద్దని పౌరులకు ఇప్పటికే ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రేపటి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి.
