పౌరసత్వం, పాస్పోర్టు సంబంధాలను కేంద్రం ప్రభుత్వం క్లియర్గా వివరించింది. భారత పౌరులకే పాస్పోర్టు జారీ అవుతున్నప్పటికీ, అది పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారిక పత్రం కాదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) స్పష్టం చేసింది. 14వ పాస్పోర్ట్ సేవా దివాస్ సందర్భంగా కేంద్రం నుంచి వచ్చిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.పాస్పోర్టు ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని తెలిపింది. పాస్పోర్టు కలిగి ఉండటం వల్ల ఒక వ్యక్తి భారత పౌరుడని నిర్ధారించలేమని పేర్కొంది. అయితే, భారత పాస్పోర్టు మాత్రం భారతీయులకే వర్తిస్తుందని చెప్పింది.
ఇటీవల ఓటర్ జాబితా ప్రక్షాళన కోసం చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆధార్ కార్డ్ మాత్రమే దేశ పౌరసత్వానికి రుజువు కాదని చెప్పింది. ఆధార్ కార్డ్ కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే అని స్పష్టం చేసింది. ఇదే విధంగా ఓటర్ ఐడీ కార్డ్ కూడా పౌరసత్వాన్ని నిరూపించే పత్రం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
భారత పౌరసత్వ చట్టాల ప్రకారం, ఒక వ్యక్తి జనవరి 26, 1950న లేదా ఆ తర్వాత, కానీ జూలై 1, 1987కి ముందు దేశంలో జన్మించి ఉంటే, వారు పుట్టుకతోనే భారతీయులుగా పరిగణించబడతారు.ఇక జూలై 1987 తర్వాత జన్మించిన వారి విషయానికొస్తే, వారి తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు పౌరులై ఉంటే, వారు పౌరసత్వాన్ని పొందవచ్చు. డిసెంబర్ 3, 2004న లేదా ఆ తర్వాత జన్మించిన వారు పౌరసత్వాన్ని పొందాలంటే, వారి తల్లిదండ్రులు ఇద్దరూ భారతీయులై ఉండాలి,లేదా తల్లిదండ్రులలో ఒకరు భారత పౌరులై ఉండి, మరొకరు జనన సమయంలో అక్రమ వలసదారుగా ఉండకూడదు.
దేశంలో పాస్పోర్ట్ సేవలు గణనీయంగా విస్తరించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. 2025లో మొత్తం 1.5 కోట్ల పాస్పోర్టులు, సంబంధిత సేవలు అందించగా, వీటిలో మ1.39 కోట్ల పాస్పోర్టులు జారీ అయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 545 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి. పదేళ్ల క్రితం ఈ సంఖ్య కేవలం 77గా మాత్రమే ఉండేది. పోలీస్ వెరిఫికేషన్ మినహాయిస్తే ప్రస్తుతం 6 వర్కింగ్ డేస్లోనే పాస్పోర్ట్ జారీ అవుతోంది. పాస్పోర్టు కేంద్రాల్లో పౌరుడు గడిపే సమయం కూడా 45 నిమిషాలకు తగ్గిందని వెల్లడించింది.

