బారామతి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు సహాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ దుర్ఘటన దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే తాజాగా కో-పైలట్ పింకీ మాలి తన తండ్రితో మాట్లాడిన మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
బుధవారం ఉదయం 8 గంటలకు ముంబై నుంచి బారామతికి విమానం బయల్దేరింది. అంతక ముందు కో-పైలట్గా ఉన్న పింకీ మాలి తన తండ్రి శివకుమార్ మాలితో ఫోన్లో మాట్లాడింది. ‘‘నాన్నా.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో కలిసి బారామతికి వెళ్తున్నాను. దింపేసిన తర్వాత అక్కడ నుంచి నాందేడ్ వెళ్తాను. మనం రేపు మాట్లాడుకుందాం.’’ అని తన కూతురు మాట్లాడిందంటూ తండ్రి శివకుమార్ గుర్తుచేసుకుంటూ విలపించారు. రేపటి రోజు ఇక ఎప్పటికీ రాదని ఆవేదన చెందారు.
‘‘నేను నా కూతురిని కోల్పోయాను. ఇలాంటి సంఘటనలు గురించి నాకు సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఏం జరిగిందో కచ్చితంగా చెప్పలేను. నేను పూర్తిగా కోల్పోయాను. నా కూతురి అంత్యక్రియలు గౌరవంగా నిర్వహించుకునేలా మృతదేహాన్ని అప్పగించాలని కోరుకుంటున్నా. నేను కోరుకునేది ఇదే..’’ అని తండ్రి శివకుమార్ డిమాండ్ చేశాడు.
ముంబైలో బుధవారం ఉదయం 8:10 గంటలకు బారామతికి బయల్దేరింది. ఉ.8:42కి మొదటి ల్యాండింగ్ సిద్ధపడింది. కానీ సాధ్యం కాలేదు. రెండోసారి ఉ.8:45కి సిద్ధపడింది. మూడోసారి రాడర్తో సంబంధం తెగిపోయి ఉదయం 8:50కి విమానం కూలిపోయింది. బారామతి ఎయిర్పోర్టుకు 100 మీటర్ల దూరంలో విమానం కూలిపోయింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని కాలిపోయారు. విమానంలో అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి విదీప్ జాదవ్, కో పైలట్ పింకీ మాలి, పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్, సెకండ్ ఇన్ కమాండ్ శాంభవి పాఠక్ ఉన్నారు. మొత్తం అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం బుధవారం ఢిల్లీ నుంచి పూణెకు వచ్చింది.
