Owaisi in West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. రాష్ట్రంలో కొత్త కూటమి ఏర్పడింది.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని AIMIM పార్టీ, హుమాయున్ కబీర్ నేతృత్వంలోని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJDUP)తో కలిసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 25న కోల్కతాలో నిర్వహించనున్న సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ పొత్తుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఈ కూటమి ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణం కనిపించే అవకాశముంది.
Read Also: Astrology: మార్చి 23, సోమవారం దినఫలాలు.. ఇవాళ ఏ రాశి వారు ఏ పరిహారం చెల్లించాలి..?
హుమాయున్ కబీర్ పార్టీ ఇప్పటికే పెద్ద సంఖ్యలో స్థానాల్లో పోటీ చేయాలని సంకేతాలు ఇచ్చింది. AIMIM కూడా పరిమిత సంఖ్యలో స్థానాల్లో పోటీ చేసే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని వ్యూహాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రాణినగర్, భగవాన్గోలా, ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలు స్థానిక రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముంది. పశ్చిమ బెంగాల్లో ప్రధాన పోటీ సాధారణంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరియు భారతీయ జనతా పార్టీ మధ్య కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో AIMIM-కబీర్ కూటమి “మూడవ శక్తి”గా ఎదగాలని ప్రయత్నిస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ కూటమి ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఓటు విభజనకు దారితీసి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముంది.
