Site icon NTV Telugu

Lok sabha: సీఈసీని తొలగించాలంటూ స్పీకర్‌కు నోటీసు.. 190 మంది ఎంపీలు సంతకాలు

Lok Sabha

Lok Sabha

దేశ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను (Chief Election Commissioner) పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు అధికారికంగా నోటీసు ఇచ్చాయి. ప్రతిపక్షం ఇచ్చిన నోటీసుపై 190 మంది ఎంపీలు సంతకం చేశారు. ఎన్నికల నిర్వహణలో తటస్థత పాటించలేదని, కొన్ని నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఈ చర్యకు దిగినట్లు ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.

ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయని, వాటిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. అందువల్ల ఆయన్ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌తో నోటీసు సమర్పించినట్లు వెల్లడించారు.

ఇక ఈ నోటీసుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల వ్యవస్థ స్వతంత్రతను కాపాడే దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ వ్యవహారం ముందుకు ఎలా సాగుతుందో, పార్లమెంట్ లేదా సంబంధిత అధికార సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ పరిణామం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. ఎవరైనా టేబుళ్లపై ఎక్కితే ఇలాంటి చర్యలు తీసుకుంటామని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించారు. సభ లోపల, వెలుపల సభ గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

త్వరలో తమిళనాడు, బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇలాంటి తరుణంలో సీఈసీని తొలగించాలని విపక్షం నోటీసు ఇవ్వడంపై తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

Exit mobile version