నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈవీ ఛార్జింగ్ చేస్తుండగా ఒక్కసారిగామంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లో మంటలు బిల్డింగ్లోకి వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా… పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తూ పలువురిని రక్షించారు.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో బుధవారం నివాస భవనంలో చెలరేగిన భారీ మంటల్లో ఇద్దరు మృతి చెందగా, సుమారు 50 కుటుంబాలు భవనంలో చిక్కుకుపోయాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి భారీ సహాయక చర్యలు చేపట్టడంతో మిగిలిన వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఫేజ్-3 పోలీస్ స్టేషన్ పరిధిలోని మమూరా గ్రామంలో ఉన్న జీ+4 నివాస భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక విచారణలో ఎలక్ట్రిక్ బైక్ను ఛార్జింగ్ చేస్తుండగా స్పార్క్ రావడంతో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. అనంతరం మంటలు పార్కింగ్లో ఉన్న పెట్రోల్ వాహనాలకు వ్యాపించి భారీ అగ్నిప్రమాదానికి దారితీశాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. హైడ్రాలిక్ ప్లాట్ఫారమ్లు, రెస్క్యూ వాహనాలు, ఏడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలో నివసిస్తున్న సుమారు 50 కుటుంబాల సభ్యులను సురక్షితంగా బయటకు తరలించారు.
గౌతమ్ బుద్ధ నగర్ జాయింట్ పోలీస్ కమిషనర్ రాజీవ్ నారాయణ్ మాట్లాడుతూ.. భవనం గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉండటంతో అక్కడ చెలరేగిన మంటల నుంచి వచ్చిన దట్టమైన పొగ పై అంతస్తులకు వ్యాపించిందని తెలిపారు. పొగ పీల్చుకోవడంతో ఇద్దరి ఆరోగ్యం విషమించడంతో వారిని వెంటనే అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అనంతరం చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఈవీ ఛార్జింగ్ సమయంలో ఏర్పడిన స్పార్క్ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని రాజీవ్ నారాయణ్ తెలిపారు. ఈ ఘటనపై ఫేజ్-3 పోలీస్ స్టేషన్లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, భవన యజమాని, లీజుదారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

