Nitish Kumar: “ప్రధాని మోడీని ఇక విడిచి పోయేది లేదు”..ఎన్డీయేతోనే ఉంటానన్న సీఎం నితీష్ కుమార్..

Nitish Kumar, Pm Modi

Nitish Kumar, Pm Modi

Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎతో కలిసి ఉంటానని, ఎక్కడికి వెళ్లనని నితీస్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో వేదికపై ఉన్న ప్రధాని మోడీ చిరునవ్వు చిందించారు. బీహార్ ఔరంగాబాద్‌లో జరిగిన బహిరంగం సభలో నితీష్ ఇలా వ్యాఖ్యానించారు. ‘‘మీరు ఇంతకముందు బీహార్ వచ్చారు, కానీ నేను మీతో లేను, ఇప్పుడు నేను మీతో ఉన్నారు, నేను ఇక ఎక్కడి వెళ్లనని మీకు హామీ ఇస్తున్నా’’ అని అన్నారు.

Read Also: Google: కేంద్రం జోక్యంతో భారతీయ యాప్‌ల పునరుద్ధరణకు అంగీకరించిన గూగుల్..

ఇటీవల బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ మహఘటబందన్ కూటమిని కాదని మరోసారి జేడీయూ అధినేత, సీఎం నితీష్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ సాయంతో 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే కూటమిలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ బీహార్ వెళ్లడం ఇదే తొలిసారి. రూ. 38,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించేందుకు పీఎం మోడీ బీహార్‌లో పర్యటించారు.

ఇండియా కూటమి ప్రధాన రూపశిల్పుల్లో ఒకరైన నితీష్ కుమార్ లోక్‌సభ ఎన్నికల ముందు తిరిగి బీజేపీ గూటికి చేరుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. బీహార్‌లో ఆర్జేడీ పార్టీకి గుడ్‌బై చెప్పడంతో పాటు ఇండియా కూటమి నుంచి వైదొలిగారు. ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి నితీష్ కుమార్‌ని గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో మళ్లీ బీజేపీతో ఆయన జతకట్టారు.