Nishant Kumar: బీహార్లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జేడీయూ అధినేత, సీఎం నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ పార్టీలో చేరారు. ఆదివారం 50 ఏళ్ల నిశాంత్ కుమార్ ఈ రోజు అధికారికంగా జేడీయూలో చేరారు. రెండు దశాబ్ధాలకు పైగా బీహార్ రాజకీయాలను శాసిస్తున్న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి త్వరలో రాజీనామా చేయబోతున్నారు. మార్చి 16న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేశారు. దీని తర్వాత ఆయన సీఎం పదవిని వదులుకోనున్నారు. మరోవైపు, బీహార్ రాష్ట్రానికి బీజేపీ నేత ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో నిశాంత్ కుమార్ను డిప్యూటీ సీఎంగా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
జేడీయూలో చేరిన తర్వాత నిశాంత్ మాట్లాడుతూ.. ‘‘నేను పార్టీని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నిస్తాను. నా తండ్రి రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయం. దానిని అంగీకరిస్తున్నాం. ఆయన మార్గదర్శకత్వంలో మేము పనిచేస్తాము. పార్టీ, ప్రజలు నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తాను’’ అని అన్నారు.
ఇంజనీర్ అయిన నిశాంత్ కుమార్ సీఎం కుమారుడైనప్పటికీ రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. జేడీయూ సీనియర్ నేతలు నిశాంత్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడాన్ని స్వాగతించారు. మరోవైపు, బీహార్లో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ రాజకీయాలకు జేడీయూ ఓటర్లు మోసపోయారని చెప్పింది. వెనిజులాలో మదురోను అమెరికా అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు, నితీష్ కుమార్ను కిడ్నాప్ చేసి, కేంద్రానికి తీసుకెళ్తున్నారని విమర్శించింది.