Nepal: భారత్-నేపాల్ మధ్య దశాబ్ధాలుగా సాగుతున్న సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధాని బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు సమస్య పరిష్కారానికి చైనా, బ్రిటన్ సాయం అవసరమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా, నేపాల్ భారత్లోని పలు ప్రాంతాలను ఆక్రమించుకుందని ప్రగల్భాలు పలికారు.
కాలాపాని, లిపులేఖ్, లింపియాధుర ప్రాంతాలపై రెండు దేశాల మధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో లిపులేఖ్ గుండా భారత్, చైనా సరిహద్దు వాణిజ్యాన్ని పున:ప్రారంభించే అంశంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కైలాస్ మానససరోవర్ యాత్ర లిపులేఖ్ పాస్ గుండా నిర్వహించడంపై నేపాల్ ప్రభుత్వం భారత్, చైనాలకు దౌత్యపరమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. లిపులేఖ్ తమ భూభాగంలో భాగమని నేపాల్ వాదిస్తోంది.
ఈ వివాదాలను దౌత్యమార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ వివాదాస్పద ప్రాంతాలపై నేపాల్ భారత్కు అధికారి దౌత్య లేఖ పంపిందని చెప్పారు. దీనిపై న్యూఢిల్లీ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి చరిత్రకారులు, సర్వేయర్లు, సరిహద్దు నిపుణులతో బృందాలను ఏర్పాటు చేసి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని భారత్ సూచించినట్లు చెప్పారు.
ఈ అంశంపై నేపాల్ చైనా, బ్రిటన్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. భారత్ మాత్రమే కాకుండా, నేపాల్ కూడా భారత్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించిందని బాలెన్ షా చెప్పారు. అయితే, ఆయన ప్రకటనను సోషల్ మీడియాలో చాలా మంది నేపాలీ నెటిజన్లు నిరాధారమైనవిగా పేర్కొన్నారు. తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మాజీ దౌత్యవేత్తలు, నిపుణులు కూడా భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నామన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
