NEET Paper Leak: నీట్-యూజీసీ పేపర్ లీక్లో వరస అరెస్టులు జరుగుతున్నాయి. శుక్రవారం కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణిని సీబీఐ అరెస్ట్ చేసింది. శనివారం మరో మహిళా లెక్చరర్ను అధికారులు అరెస్ట్ చేశారు. బోటనీ ఉపాధ్యాయురాలిగా ఉన్న పూణేకు చెందిన మనీషా గురునాథ్ మంధారేను ఢిల్లీలో అరెరస్ట్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆమెను ఎక్స్పర్ట్గా నియమించిన తర్వాత, ఆమె పేపర్ తయారీ ప్రక్రియలో పాల్గొన్నట్లు సీబీఐ చెప్పింది. ఈ అరెస్టుతో మొత్తం అరెస్టుల సంఖ్య 9కి చేరింది.
Read Also: Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
ఇప్పటికే అరెస్టయిన మనీషా వాఘ్మారే ద్వారా మనీషా కొంత మంది నీట్ అభ్యర్థులతో ఏప్రిల్ నెలలోనే సంప్రదింపులు జరిపింది. దీని తర్వాత తన ఇంట్లోనే కోచింగ్ క్లాసులు నిర్వహించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. బోటనీ, జువాలజీలో వచ్చే ప్రశ్నల్ని ముందుగానే విద్యార్థులకు చెప్పి, తప్పకుండా ఇవే పరీక్షలో వస్తాయని వారితో ప్రాక్టీస్ చేయించినట్లు అధికారులు వెల్లడించారు. మే 3న పరీక్షలో వచ్చిన ప్రశ్నలు దాదాపుగా మనీషా లీక్ చేసిన ప్రశ్నలతో సరిపోలినట్లు తేలింది.
ఈ పేపర్ లీక్లో కులకర్ణి తర్వాత ఇప్పుడు మరో లెక్చరర్ అరెస్ట్ అయ్యారు. కులకర్ణి కూడా ఇలాగే కెమిస్ట్రీ ప్రశ్నలను ముందుగానే విద్యార్థులకు లీక్ చేశారు. తన ఇంట్లోనే కోచింగ్ నిర్వహించి విద్యార్థులకు ఇవే ప్రశ్నలు వస్తాయని చెప్పారు. గత 24 గంటల్లో సీబీఐ దేశవ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సీబీఐ, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, అహిల్యానగర్ ప్రాంతాలకు చెందిన నిందితులు ఉన్నట్లు సమాచారం.
