దివంగత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. జనవరిలో ముంబై నుంచి బారామతికి విమానంలో వస్తుండగా ఎయిర్పోర్టు సమీపంలో కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో అజిత్ పవార్తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా అజిత్ పవార్ చివరి సారి మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణను ఎన్సీపీ విడుదల చేసింది. అజిత్ పవార్ వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రజలకు తెలియాలనే ఆడియో విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించింది.
జనవరి 28న ఉదయం 8:10 గంటలకు ముంబై నుంచి బారామతికి బయల్దేరారు. ఆ సమయంలో ఎన్సీపీకి చెందిన 66 ఏళ్ల శ్రీజీత్ పవార్.. అజిత్ పవార్కు ఒక మెసేజ్ పంపించారు. ఇక విమానం నెట్వర్క్ కవరేజ్ ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత అజిత్ పవారే స్వయంగా తిరిగి ఫోన్ చేశారు. ఉదయం 8:37 నిమిషాలకు కరెక్ట్గా ఫోన్ మాట్లాడారు. అంటే మరణానికి ముందు కొన్ని నిమిషాల ముందే మాట్లాడారు.
సంభాషణ ఏంటంటే..
అజిత్ పవార్: మేము అన్ని కులాలు, మతాలను కూడా కలుపుకుని పోతాం.
శ్రీజీత్ పవార్: లేదు దాదా.. నేను నాకు అనిపించిందే చెప్పాను.
అజిత్ పవార్: జిల్లా పరిషత్లో సూప్ గ్రూప్ నుంచి మాలి కమ్యూనిటీకి ప్రాతినిధ్యం లభించింది. మేము అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నించాం.
శ్రీజీత్ పవార్: అవును దాదా.. మీరు సరైనదని భావించే ఏ నిర్ణయమైనా తీసుకోండి.
అజిత్ పవార్-కార్యకర్త శ్రీజీత్ పవార్ మధ్య కేవలం ప్రమాదానికి 10 నిమిషాల ముందు ఈ సంభాషణ జరిగింది. అజిత్ పవార్ మనస్తత్వం ఎలాంటిదో ప్రజలకు అర్థం కావాలనే ఈ ఆడియో విడుదల చేస్తున్నామని శ్రీజీత్ పవార్ పేర్కొన్నారు. అన్ని మతాలు.. కులాలు ఒక్కటి కావాలని దాదా కోరుకున్నారని గుర్తుచేశారు.
‘‘అజిత్ దాదా.. నేను ఒకే గ్రామానికి చెందిన వాళ్లం. నేను ఒక నిర్దిష్ట విషయం గురించి సందేశం పంపాను. నెట్వర్క్ కవరేజ్ వచ్చిన వెంటనే దాదా నాకు ఫోన్ చేశాడు. మేము అన్ని కులాలు, మతాలను మాతో పాటు తీసుకెళ్తున్నామన్నారు. అజిత్ దాదా చివరి శ్వాస వరకు ఆయన ఆలోచనలు ఏమిటో మహారాష్ట్రకు తెలిసేలా ఈ ఆడియో కాల్ రికార్డింగ్ను అందరి దృష్టికి చేరాలని ఇదొక ప్రయత్నం. అందుకే బహిరంగంగా విడుదల చేస్తున్నాం’’ అని శ్రీజీత్ అన్నారు.
అజిత్ పవార్ ఆరుసార్లు డిప్యూటీ సీఎంగా పని చేశారు. పృథ్వీరాజ్ చవాన్, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే మంత్రివర్గాల్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి కోరిక నెరవేరకుండానే వెళ్లిపోయారు. ఇక ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఒక విమాన సహాయకురాలు, ఇద్దరు కాక్పిట్ సిబ్బంది మరణించారు. ఇక అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన భార్య సునేత్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.
