National award winning playback singer Shivamoga Subbanna passed away: ప్రముఖ గాయకుడు, జాతీయ అవార్డు గ్రహీత శివమొగ్గ సుబ్బన్న(83) కన్నుమూశారు. బెంగళూర్ లోని జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్లో చికిత్స పొందుతున్న సుబ్బన్నకు గత రాత్రి తీవ్రమైన గుండె నొప్పి రావడంతో మరణించారు. సుబ్బన్న కర్ణాటక రాష్ట్రం నుంచి మొదటిసారిగా జాతీయ అవార్డు అందుకున్న సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కాదు కుదురే’ చిత్రంలో ఆయన పాడిన ‘కాదు కుదురే ఒడి బండిట్ట’ పాటకు జాతీయ అవార్డు వచ్చింది. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన అభిమానుల సందర్శనార్థం బెంగళూర్ లోని రవీంద్ర కళాక్షేత్రంలో పార్థీవదేహాన్ని ఉంచనున్నారు.
Read Also: RBI Update: ఆర్బీఐలోకి ఆ నలుగురు మళ్లీ
సుబ్బన్న అసలు పేరు జి. సుబ్రమణ్యం. గణేష్ రావు, రంగనాయకమ్మలకు 1938లో శివమొగ్గ జిల్లాలోని నగర్ గ్రామంలో జన్మించారు. సుబ్బన్న తాగా శ్యామన్న సంగీతంలో పండితుడు. దీంతో సుబ్బన్న కూడా సంగీతంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. శాస్త్రీయ సంగీతంలో పట్టు సంపాదించారు. బీఏ ఎల్ఎల్బీ చేసిన సుబ్బన్న కొంత కాలం న్యాయవాదిగా కూడా పనిచేశారు. ఆ తరువాత గాయకుడిగా మారారు. కన్నడ చిత్రసీమలో సుబ్బన్న తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ దర్శకుడు చంద్ర శేఖర కంబార్ ‘కరిమాయి’ సినిమా ద్వారా నేపథ్య గాయకుడిగా పరిచయం అయ్యారు. 1979లో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి చేతుల మీదుగా రజత కమలం అవార్డును అందుకున్నారు సుబ్బన్న. సుబ్బన్నకు అనేక అవార్డులను ప్రధానం చేసింది కర్ణాటక సర్కార్. ప్రతిష్టాత్మక సంత్ శిశునాల షరీఫ్ అవార్డుతో పాటు రాజ్యోత్సవ అవార్డ్, సంగీత అకాడమి కర్ణాటక కళా తిలక్ అవార్డ్ తో సత్కరించింది.