DMK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత డీఎంకే పార్టీ సంస్థాగత సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమైన పార్టీ పదవులకు వయో పరిమితితో పాటు గరిష్టంగా రెండు సార్లు మాత్రమే పదవిలో కొనసాగే నిబంధనలను తీసుకువచ్చారు. పార్టీలోకి కొత్త రక్తాన్ని తీసుకువచ్చేందుకే ఈ సంస్కరణలు తీసుకువస్తున్నట్లు డీఎంకే తెలిపింది. చెన్నైలోని అన్నా అరివాలయంలో జరిగిన డీఎంకే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించడం ద్వారా ఈ మార్పులకు ఆమోదం లభించింది. డీఎంకే ఎంపీ పి విల్సన్ ఈ మార్పుల్ని స్వాగతించారు. పార్టీకి ఇవి సంక్షేమ చర్యలని, దీనివల్ల అందరూ సంతోషిస్తున్నారని తెలిపారు.
కొత్త నిబంధనల ప్రకారం, బ్రాంచ్ పార్టీ సెక్రటరీ గరిష్ట వయసు 45 సంవత్సరాలుగా నిర్ణయించారు. మున్సిపల్, సిటీ, టౌన్ పంచాయతీల వార్డు కార్యదర్శుల వయసు 50 ఏళ్లకు మించకూడదు, టౌన్ పంచాయతీ పార్టీ కార్యదర్శులు, ఏరియా కమిటీ కార్యదర్శులు, సిటీ కమిటీ కార్యదర్శుల వయోపరిమితిని 60 ఏళ్లుగా నిర్ణయించారు. జిల్లా పార్టీ కారద్యర్శులకు గరిష్ట వయో పరిమితిని 70 ఏళ్లుగా చెప్పారు. ఈ పదవుల్లో ఏదైనా చేపట్టే వ్యక్తులు గరిష్టంగా రెండు పర్యాయాలు మాత్రమే పదవిలో కొనసాగేందుకు అనుమతి ఉంటుంది. ఇక గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ లోని ప్రతీ ఏరియా కమిటి పరిధిలో సగటున 40,000 మంది ఓటర్లు ఉండేటా నిర్ణయించారు. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో ఒక్కో ఏరియా కమిటీ పరిధిలో సగటున 30,000 మంది ఓటర్లు ఉండేలా నిర్మాణాన్ని మార్చారు.

