Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య భార్య మీరా భట్టాచార్య బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం హామీలను వేగంగా అమలు చేస్తోందని ఆమె అన్నారు. బెంగాలీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం కేవలం కొన్ని రోజుల్లోనే హామీలను అమలు చేయడం ప్రశంసనీయం అని, హామీల అమలు వేగాన్ని చూస్తే సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేస్తున్న వారు గౌరవానికి అర్హులు అని ఆమె మాట్లాడారు.
సీఎం సువేందు అధికారి గురించి మాట్లాడుతూ.. ఆయనను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని, కానీ బెంగాల్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తారనే ఆశాభావం ఉందని చెప్పారు. పాలన విషయంలో టీఎంసీ, లెఫ్ట్ ప్రభుత్వానికి పోలిక లేదని చెప్పారు. లెఫ్ట్ 34 ఏళ్ల పాలన, టీఎంసీ 15 ఏల్ల పాలనకు మధ్య పోలికను తోసిపుచ్చారు. నందన్, విద్యాసాగర్ సేతు, సాహిత్య అకాడమీ, శిశు కిషోర్ అకాడమీ వంటి అనేక కీలక సంస్థలు, మౌలిక సదుపాయాలను స్థాపించిన ఘటన లెఫ్ట్ ప్రభుత్వానిది అని, వ్యవసాయంలో బెంగాల్ను దేశంలో అగ్రగామిగా చేసిందని అన్నారు.
సింగూర్ వివాదాన్ని ప్రస్తావిస్తూ.. టాటా మోటార్స్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్ను వ్యతిరేకించినందుకు చాలా మంది స్థానికులు ఇప్పుడు బాధపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఒక వేళ ఈ ఫ్యాక్టరీ స్థాపించబడి ఉంటే బెంగాల్ ఆర్థిక ముఖచిత్రమే మారిపోయేదని చెప్పారు. తన భర్త బుద్ధదేవ్ భట్టాచార్య విజన్ ఈ ప్రాజెక్టుకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కల్పించడం ఆయన లక్ష్యమని చెప్పారు.
గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో అన్ని రంగాలు క్షీణించాయని ఆమె ఆరోపించారు. లెఫ్ట్ ఫ్రంట్ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. మీనాక్షి ముఖర్జీ, దీప్సితా ధర్ వంటి యువ నాయకులు పార్టీని పునర్నిర్మించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. బెంగాల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం చూడాలన్నదే తన భర్త కల అని మీరా భట్టాచార్జీ అన్నారు. కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం బెంగాల్ పూర్వ వైభవాన్ని, కీర్తిని పునరుద్ధరిస్తే దానిని తప్పకుండా స్వాగతిస్తానని చెప్పారు.

