Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?

  • చర్చనీయాంశంగా మీనాక్షి నటరాజన్‌ వ్యవహారం
  • రాజ్యసభ నామినేషన్ తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి
  • తెలంగాణ కేసు ప్రస్తావించకపోవడంపై తిరస్కరణ
  • ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు
Meenakshi Natarajan

Meenakshi Natarajan

ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు మీనాక్షి నటరాజన్. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ తర్వాత ఎక్కువగా ఈ పేరు మీడియాలో మార్మోగుతోంది. అసలు ఎందుకు మీనాక్షి నామినేషన్ తిరస్కరించబడింది. కాంగ్రెస్ నాయకులతో పాటు సామాన్య కార్యకర్తల వరకు ఇదే చర్చ నడుస్తోంది. అసలు ఎందుకు నామినేషన్ తిరస్కరించబడింది. ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

మీనాక్షి నటరాజన్‌.. తెలంగాణ కాంగ్రెస్ ఇ‌న్‌ఛార్జ్. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనూహ్యంగా నామినేషన్ తిరస్కరించబడింది. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఒక కోర్టు వ్యవహారాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించలేదని బీజేపీ ఆరోపించగా.. తనపై ఎలాంటి క్రిమినల్ కేసు లేదని మీనాక్షి నటరాజన్ వాపోయారు. అయితే రిటర్నింగ్ అధికారి మాత్రం నామినేషన్ తిరస్కరించారు. దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

×
×
Ad

అసలు కథ ఇదే!


ఈ వివాదానికి కేంద్రబిందువుగా ఉన్నది తెలంగాణకు చెందిన మాజీ కాంగ్రెస్ కార్యకర్త దాఖలు చేసిన ఒక ప్రైవేట్ ఫిర్యాదు. 2022లో ఒక మహిళా కాంగ్రెస్ కార్యకర్త.. సహచర కాంగ్రెస్ నాయకుడిపై వేధింపులు, లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని పలుమార్లు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. దీంతో మీనాక్షి నటరాజన్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతల పేర్లను కూడా ఫిర్యాదులో ప్రస్తావించింది.

ఫిర్యాదు ఏమిటి?

ఫిర్యాదుదారు కథనం ప్రకారం.. 2022లో ఒక కాంగ్రెస్ నాయకుడు తనను వేధించాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ విషయాన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని కోరినా ఫలితం లేకపోయిందని తెలిపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కుటుంబ సభ్యులు ఐఏఎస్ అధికారులు కావడంతో పార్టీలో ప్రభావం చూపించారని.. కేసును అణిచివేయడానికి ప్రయత్నాలు జరిగాయని ఆమె ఆరోపించింది. తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు డిమాండ్ చేసినప్పటికీ.. తననే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారని పేర్కొంది.

మీనాక్షి నటరాజన్ పేరు ఎందుకు వచ్చింది?

2025 సెప్టెంబర్‌లో బాధిత మహిళ హైదరాబాద్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించి ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో పాటు.. తన ఫిర్యాదులపై చర్యలు తీసుకోలేదనే కారణంతో మీనాక్షి నటరాజన్ సహా పలువురు కాంగ్రెస్ నాయకుల పేర్లను కూడా చేర్చింది. అయితే ఫిర్యాదులో మీనాక్షి నటరాజన్‌పై ప్రత్యక్షంగా వేధింపుల ఆరోపణలు లేవుగానీ.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా తన సమస్యను పట్టించుకోలేదని ఆరోపించింది. ఫిర్యాదుదారు ప్రకారం.. తన సమస్యపై మీనాక్షి నటరాజన్‌ను వ్యక్తిగతంగా కలిసినప్పుడు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని సస్పెండ్ చేసినట్లు కూడా చెప్పారని పేర్కొంది. అయితే ఆ సస్పెన్షన్‌కు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఎప్పుడూ చూపించలేదని ఆరోపించింది.

కోర్టు నోటీసు, కేసు పరిస్థితి

హైదరాబాద్ కోర్టు 2025లో మీనాక్షి నటరాజన్‌కు నోటీసు జారీ చేసింది. అయితే కాంగ్రెస్ వాదన ప్రకారం ఇది కేవలం ప్రాథమిక విచారణలో భాగంగా జారీ చేసిన నోటీసు మాత్రమే. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని.. అభియోగాలు కూడా మోపలేదని పార్టీ చెబుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం ప్రాథమిక దశలోనే ఉండగా.. విచారణ కొనసాగుతోంది.

రాజ్యసభ నామినేషన్ ఎందుకు తిరస్కరించారు?

జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్‌పై బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ కోర్టు వ్యవహారాన్ని అఫిడవిట్‌లో వెల్లడించలేదని ఆరోపించారు. ఈ అభ్యంతరాన్ని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి.. సంబంధిత సమాచారం వెల్లడించలేదనే కారణంతో నామినేషన్‌ను తిరస్కరించారు. అవసరమైన వివరాలు ఇవ్వడానికి అవకాశం కల్పించినప్పటికీ ఆమె అందించలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసు లేదని, కేవలం ప్రైవేట్ ఫిర్యాదులో నోటీసు మాత్రమే వచ్చిందని పేర్కొంది. నామినేషన్ తిరస్కరణ చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఇది కాంగ్రెస్-బీజేపీ మధ్య మరో ప్రధాన వివాదంగా మారింది. ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.