NTV Telugu Site icon

Manipur BJP MLA: ప్రధాని మోడీపై మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం.. కలవడానికి అవకాశమివ్వలేదు

Manipur Bjp Mla

Manipur Bjp Mla

Manipur BJP MLA: మణిపూర్‌లో కొనసాగుతున్న పరిస్థితులపై దేశవ్యాప్తంగా నిరసన పెల్లుబికుతోంది. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత అని ప్రపతిపక్షాలు, ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రతి పక్షాలు విమర్శించడమే కాదు.. సొంత పార్టీకి చెందిన మణిపూర్‌ బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీపైనే కాదు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సొంత పార్టీలోనే అసంతృప్తి పెరుగుతోంది. మోదీ నిజమైన సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినపడుతున్నాయి. రాష్ట్ర సమస్యల గురించి చెప్పడానికి అవకాశం లభించడం లేదని బీజేపీ ఎమ్మెల్యేల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే పావోలియెన్లాల్ హవోకిప్ మీడియాతో మాట్లాడుతూ, తమ రాష్ట్రంలో దాదాపు 79 రోజుల నుంచి హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్పందించడంలో కనీసం ఓ వారం ఆలస్యమైనా చాలా ఎక్కువ సమయంగా పరిగణించాలని అన్నారు. సుదీర్ఘ మౌనం తర్వాత మోడీ పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే తప్పుబట్టారు. రాష్ట్రంలోని కుకీ-జోమీ తెగ ప్రతినిధిగా తాను ప్రధానితో మాట్లాడటానికి ప్రయత్నించానని, అమెరికా వెళ్లడానికి ముందు ప్రధానిని కలవడానికి ప్రయత్నించానని.. కానీ ఆయన అపాయింట్‌మెంట్ తనకు లభించలేదని చెప్పారు. అంతర్జాతీయ సంబంధాలు ముఖ్యమైనవే అయినప్పటికీ, ప్రజలు మరణిస్తున్న సమయంలో సమస్యను పరిష్కరించవలసిన అవసరం, మానవత్వాన్ని చూపించవలసిన ఆవశ్యకత ఉన్నాయన్నారు. ప్రస్తుతం అది లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆయనకు వివరించేందుకు ఇప్పటికీ ఎదురు చూస్తున్నామని చెప్పారు.

Read also: Kethika Sharma : బిగుతైనా అందాలతో రెచ్చగొడుతున్న కేతిక శర్మ..

మణిపూర్‌లో తమకు ప్రత్యేక పాలనా విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరిన పది మంది కుకీ ఎమ్మెల్యేల్లో హవోకిప్ ఒకరు. కుకీలను కాపాడటంలో ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వారు ఆరోపించారు. మే 3 నుంచి ప్రారంభమైన హింసాత్మక సంఘటనలకు రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉందని ఆరోపించారు. చిన్-కుకి-మిజో-జోమి గిరిజనులపై హింసకు బిరేన్ సింగ్ ప్రభుత్వం మద్దతిస్తోందని మండిపడ్డారు. దీనివల్లనే రాష్ట్రంలో విభజన ఏర్పడిందని తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి, ఆడియో, వీడియోలు ఉంటేనే మోదీ, ముఖ్యమంత్రి, కేంద్ర హోం మంత్రి దృష్టి సారిస్తారా? అని హవోకిప్ ప్రశ్నించారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన గురించి ఇటీవలే తెలిసిందని బిరేన్ సింగ్ చెప్పడం మసిబూసి మారేడు కాయ చేయడం కోసమేనని బీజేపీ ఎమ్మెల్యే హవోకిప్‌ విమర్శించారు.