Congress: “అఖండ కాంగ్రెస్”.. విలీనం దిశగా టీఎంసీ, ఎన్సీపీ..

  • అఖండ కాంగ్రెస్ దిశగా హస్తం పార్టీ..
  • టీఎంసీ, ఎన్సీపీలు కలుస్తాయంటూ ఊహాగానాలు..
Congress

Congress

Congress: దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా బెంగాల్ మమతా బెనర్జీ ఓటమి, టీఎంసీలో అంతర్గత సంక్షోభాలను కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటోంది. మమతా పార్టీ రెండు ముక్కలుగా చీలింది. ఎమ్మెల్యేలు, ఎంపీల్లో స్పష్టమైన విభజన కనిపిస్తోంది. మమత కేవలం తక్కువ మంది మద్దతు కలిగి ఉంది. అయితే, ఈ నేపథ్యంలో ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. మమతా బెనర్జీ లాగే ఎన్సీపీ(శరద్ పవార్) కూడా తన పార్టీని కాంగ్రెస్‌లోనే విలీనం చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అఖండ కాంగ్రెస్ వైపు..

మమతా బెనర్జీ, శరద్ పవార్ ఇద్దరూ కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లి సొంతగా పార్టీలు పెట్టుకున్న వారే. ఇప్పుడు తమ మాతృపార్టీలోనే తమ పార్టీలను విలీనం చేస్తారనే ప్రచారం నడుస్తోంది. ఇదే నిజమైతే ‘‘అఖండ కాంగ్రెస్’’ సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ విలీనం వార్తల్ని టీఎంసీ, కాంగ్రెస్ తోసిపుచ్చాయి. అయినప్పటికీ ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలు ఈ వార్తల్ని ఖండించారు.

×
×
Ad

నేతల కామెంట్స్‌పై చర్చ..

అయితే, మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో్ కొత్త చర్చకు దారి తీశాయి. ఒకే భావజాలం కలిగిన పార్టీలు కాంగ్రెస్‌లో విలీనం కావడానికి సిద్ధమవుతున్నాయని, శరద్ పవార్, మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్‌లో విలీనం గురించి ఆలోచిస్తున్నారని నానా పటోలే వ్యాఖ్యానించారు. ఇది కేవలం పొత్తు మాత్రమే కాదని, పూర్తిస్థాయి విలీనం కావొచ్చని అన్నారు. శరద్ పవార్ విలీనానికి సంబంధించిన ప్రతిపాదనల్ని కాంగ్రెస్‌కు పంపారని, కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమైందని చెప్పారు. దేశంలో ఓట్ల చీలిక అడ్డుకోవాలంటే లౌకిక, ప్రజాస్వామ్య భావజాలం కలిగిన శక్తుల్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.

ఇటీవల శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ నుంచి విడిపోయిన పార్టీలు తిరిగి కాంగ్రెస్‌లో విలీనం కావాలని, ఆ ప్రక్రియకు శరద్ పవార్ నాయకత్వం వహించాలని సూచించారు. అయితే, ఈ వ్యాఖ్యల్ని శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఖండించకుండా.. ముందుగా వర్షం పడనివ్వండి గొడుగు తీసుకోవాలా, రెయిన్ కోట్ వేసుకోవాలా అని చూద్దాం అంటూ ఆసక్తికర వ్యాక్యలు చేశారు. రాజస్థాన్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలన్నీ కూడా తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అన్ని ప్రతిపక్ష పార్టీలు అంగీకరిస్తే దేశ రాజకీయాల్లో కీలక మార్పు వస్తుందని అన్నారు.

వరస భేటీలో ఊహాగానాలు..

రాహుల్ గాంధీ – అభిషేక్ బెనర్జీ, సోనియా గాంధీ-మమతా బెనర్జీల మధ్య వరస భేటీల తర్వాత ఈ విలీనం వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలపై కాంగ్రెస్ అంతర్గత వర్గాలు మాట్లాడుతూ.. విలీన ప్రతిపాదన కాంగ్రెస్ నుంచి కాకుండా టీఎంసీ, ఇతర పార్టీల నుంచే రావాలని, కాంగ్రెస్ ఎలాంటి ఒత్తిడి చేయడని చెబుతున్నాయి.