పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ భావోద్వేగ ప్రసంగం చేశారు. పార్టీ మారాలని అనుకునేవాళ్లు వెళ్లిపోవచ్చని సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని మళ్లీ మొదటి నుంచి నిర్మిస్తానని.. పార్టీని వీడి వెళ్లాలనుకునేవాళ్లు వెళ్లొచ్చని స్పష్టం చేశారు. ఓటమి వచ్చినా తృణమూల్ కాంగ్రెస్ ఎప్పటికీ తలవంచదని అన్నారు.
శుక్రవారం కోల్కతాలోని కాళీఘాట్ నివాసంలో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో మమత సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ భావోద్వేగ ప్రసంగం చేసినట్లు తెలుస్తోంది. ‘‘పార్టీని మళ్లీ కొత్తగా నిర్మిస్తాను. మన పార్టీ కార్యాలయాలు దెబ్బతిన్న చోట వాటిని మళ్లీ బాగుచేయండి. అవసరమైతే నేనే రంగులు వేస్తాను.’’ అని సూచించారు. అదే సమయంలో పార్టీని వీడే నేతలపై కూడా మమత స్పందించారు. “ఇతర పార్టీలకు వెళ్లాలనుకునేవాళ్లు వెళ్లొచ్చు. తృణమూల్ కాంగ్రెస్ ఎప్పటికీ తలవంచదు. ప్రజల తీర్పును దోచుకున్నారు” అంటూ ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 294 స్థానాల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత ఎన్నికల్లో 212 స్థానాలు గెలిచిన టీఎంసీ ఈసారి కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. టీఎంసీ 291 స్థానాల్లో పోటీ చేయగా.. డార్జిలింగ్ పర్వత ప్రాంతంలోని మూడు స్థానాలను మిత్రపక్షం భారతీయ గోర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చా (బీజీపీఎం)కి వదిలింది. అయితే టీఎంసీ తరఫున పోటీ చేసిన 291 మందిలో కేవలం 80 మంది మాత్రమే విజయం సాధించగా.. 211 మంది ఓటమి పాలయ్యారు. వీరిలో పలువురు కీలక నేతలు, మంత్రులు కూడా ఉన్నారు.
ఇక ఫలితాల అనంతరం మే 5న కూడా మమత ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. “కొంతమంది ఇతర పార్టీలకు వెళ్లొచ్చని నాకు తెలుసు. వాళ్లకు వారి కారణాలు ఉండొచ్చు. ఎవ్వరినీ బలవంతంగా ఆపాలని నేను అనుకోవడం లేదు” అని అప్పుడే స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్ల మధ్య కార్యకర్తల్లో నమ్మకం పెంచడం, పార్టీని తిరిగి బలోపేతం చేయడమే మమత ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
