మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా ఆలయ ప్రాంగణంలో గోడ కూలిపోవడంతో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. సంగ్లీ జిల్లా జత్ తహసీల్ పరిధిలోని మోతేవాడి గ్రామంలో ఉన్న మార్గుదేవి ఆలయంలో మంగళవారం సాయంత్రం ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 350 మంది ఆలయ ప్రాంగణంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలోనే భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు ఒక్కసారిగా మొదలవడంతో భక్తులు గోడ పక్కన రేకుల షెడ్ల కింద ఆశ్రయం పొందేందుకు వెళ్లారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా గోడతో పాటు టిన్ షీట్లు ఒక్కసారిగా కూలిపోవడంతో పలువురు భక్తులు వాటి కింద చిక్కుకుపోయారు. ప్రమాదంలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరో 12 నుంచి 14 మంది వరకు గాయపడినట్లు వెల్లడించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
