రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసేందుకు తన ముఖ్యమంత్రి పదవిని ఉపయోగించుకుంటానని, సామాన్య పౌరుల జీవితాల్లోకి ‘అచ్చే దిన్’ తీసుకురావడానికి ప్రయత్నిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. బాలాసాహెబ్ హిందుత్వాన్ని ధర్మవీర్ ఆనంద్ దిఘే బోధనలను ముందుకు తీసుకెళ్తామన్నారు. మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ వచ్చే వారంలో ఉంటుందని ఏక్నాథ్ షిండే చెప్పారు. ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో సంపూర్ణ చర్చల అనంతరం మంత్రిమండలి కూర్పు ఉంటుందని తెలిపారు. శనివారం షిండే, ఫడ్నవీస్లు ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేపట్టారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలుసుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోదీతో షిండే భేటీ కావడం ఇదే తొలిసారి.
అనంతరం దేశ రాజధానిలో దేవేంద్ర ఫడ్నవీస్, షిండే సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెబుతున్న మాటల్ని షిండే తోసిపుచ్చారు.164 మంది ఎమ్మెల్యేలతో తమ ప్రభుత్వం బలంగా ఉందని, పూర్తి కాలం తను పదవిలో ఉంటానని ధీమాగా చెప్పారు. ఒకప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కావడం పట్ల అసంతృప్తిగా లేదా అన్న ప్రశ్నకు తాను పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటానని బదులిచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రే నాయకుడని, షిండే నాయకత్వంలో పని చేస్తామనన్నారు. ప్రభుత్వాన్ని పూర్తికాలం విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. శుక్రవారం హోం మంత్రి అమిత్ షాతో షిండే, ఫడ్నవీస్ సుదీర్ఘంగా జరిపిన చర్చల్లో అధికార పంపిణీ కసరత్తు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.
శివసేన నాయకుడు ఉద్ధవ్ థాకరే తన పార్టీలో తిరుగుబాటు కారణంగా రాజీనామా చేయడంతో జూన్ 30న కొత్త ప్రభుత్వానికి షిండే ముఖ్యమంత్రిగా, ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. షిండే తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఆయనతో కొంతమంది స్వతంత్ర ఎమ్మెల్యేలు చేరారు. మంత్రివర్గ విస్తరణపై చర్చల అనంతరం త్వరలో నిర్ణయం తీసుకుంటామని షిండే గతంలో చెప్పారు. షిండే శిబిరంలోని డజను మందికి పైగా మంత్రులను చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉద్ధవ్ ప్రభుత్వంలోని ఎనిమిది మంది మంత్రులు షిండేతో కలిసి తిరుగుబాటులో పాల్గొన్నారు. వీరందరికీ మళ్లీ మంత్రి పదవులు దక్కవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.