Lone survivor: మృత్యుంజయుడు.. విమానం నుంచి ప్రాణాలతో ఇలా బయటపడ్డాడు..

  • విమానం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు..
  • ప్రమాదంలో విమానం నుంచి సీటుతో సహా బయట పడిన వ్యక్తి..
Vishwash Kumar Ramesh

Vishwash Kumar Ramesh

Lone survivor: ఎయిరిండియా విమానం ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటన పట్ల యావత్ దేశంతో పాటు ప్రపంచ దేశాలు సంతాపాన్ని వ్యక్తం చేశాయి. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా అందరూ మరణించారు. విమానం మెడికల్ కాలేజ్ హస్టల్‌పై కూలడంతో 24 మంది మెడికోలు చనిపోయారు.

Read Also: Israel Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో భారతీయులకు కీలక సలహా..

ఇదిలా ఉంటే, ఇంత పెద్ద ప్రమాదం నుంచి మృత్యుంజయుడిగా బయటపడిన బ్రిటిష్ జాతీయుడు విశ్వష్ కుమార్ రమేష్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. దేవుని దయతో బయటపడినట్లు మాట్లాడుకుంటున్నారు. విమానం ఎడవ వైపున ఎమర్జెన్సీ డోర్ వద్ద 11ఏ సీటులో కూర్చున్న రమేష్ ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

విమానం టేకాఫ్ అయిన తర్వాత కొద్దిసేపటికే విమానం కుప్పకూలిందని, ఈ ప్రమాదంలో తన సీటు విమాన శిథిలాలకు దూరంగా ఎగిరిపడిపోయిందని అతను చెప్పాడు. ఈ కారణంగానే విమానాన్ని మంటలు చుట్టుముట్టినప్పటికీ, రమేష్ మాత్రం సురక్షితంగా ప్రాణాలు కాపాడుకోగలిగాడు. ‘‘ విమానం రెండు ముక్కలైంది. నా సీటు బయటపడింది’’ అని అతడికి చికిత్స చేస్తున్న అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌లోని డాక్టర్లకు చెప్పాడు. తాను ప్రమాద సమయంలో విమానం నుంచి దూకలేదని, విమానం విచ్ఛిన్నమైనప్పుడు తన సీటుతో సహా బయటకు విసిరివేయబడ్డానని వైద్యులకు వెల్లడించారు. ఈ ప్రమాదంలో రమేష్‌కి స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి.