బీహార్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవిలకు కల్పించిన అత్యున్నత ‘జెడ్ ప్లస్’ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో వివాదం చెలరేగింది. ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన లాలూ దంపతులు తమకు కొత్తగా కేటాయించిన భద్రతా సిబ్బందిని తిరిగి పంపించేశారు. దీంతో వారి నివాసం దగ్గర ఆర్జేడీ కార్యకర్తలు కర్రలతో కాపలా కాస్తూ కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
బీహార్లో వీఐపీల భద్రతపై ఇటీవల నిర్వహించిన సమీక్ష అనంతరం రాష్ట్ర ప్రభుత్వం లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల జెడ్ ప్లస్ భద్రతను తొలగించింది. దాని స్థానంలో బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ (BSAP) సిబ్బందితో కొత్త భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ భద్రతా వ్యవస్థలో ఇద్దరి నుంచి ఎనిమిది మంది హౌస్ గార్డులు, ఇద్దరు బాడీగార్డులు, ఒక పైలట్ వాహనం, బుల్లెట్ప్రూఫ్ కారు ఉన్నాయి. అయితే ఈ భద్రతను నామమాత్రపు రక్షణగా అభివర్ణించిన లాలూ కుటుంబం.. తమ 10 సర్క్యులర్ రోడ్ నివాసం దగ్గర విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిని వెనక్కి పంపించింది. ఇదే తరహాలో బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ కూడా తనకు ఉన్న ‘వై’ కేటగిరీ భద్రతను తిరస్కరించారు.
హత్యకు కుట్ర
లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. తమ కుటుంబానికి హాని కలిగించాలనే దురుద్దేశంతోనే భద్రతను తగ్గించారని ఆరోపించారు. భద్రత పేరిట కేవలం చూపుడు బొమ్మలా ఏర్పాట్లు చేయడంలో అర్థం లేదని.. అందుకే రబ్రీదేవి భద్రతా సిబ్బందిని తిరిగి పంపించారని పేర్కొన్నారు. అలాగే ఆర్జేడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో 10 సర్క్యులర్ రోడ్ నివాసం దగ్గరకు చేరుకుని యాదవ్ కుటుంబానికి తామే అసలైన రక్షణ కవచమని చూపించాలని ఆమె పిలుపునిచ్చారు.
బంగ్లా ఖాళీకి ఆదేశాలు
ఈ వివాదానికి మరో కారణం కూడా ఉంది. ఇటీవలే బీహార్ భవన నిర్మాణ శాఖ.. రబ్రీదేవి ప్రస్తుతం నివసిస్తున్న 10 సర్క్యులర్ రోడ్ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ బంగ్లాను పాడి పరిశ్రమలు, మత్స్యశాఖ మంత్రి నంద్ కిషోర్ రామ్కు కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే రబ్రీదేవి మాత్రం బంగ్లా ఖాళీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. “ప్రభుత్వం బలవంతంగా ఖాళీ చేయిస్తే చేయించుకోండి. నేను స్వచ్ఛందంగా ఇల్లు వదిలిపెట్టను” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
రాజకీయ వేడి
లాలూ కుటుంబ భద్రత తగ్గింపు, ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలన్న ఆదేశాలు బీహార్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. దీనిని రాజకీయ కక్షసాధింపు చర్యగా ఆర్జేడీ అభివర్ణిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం భద్రతా సమీక్షలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. ప్రస్తుతం లాలూ కుటుంబ నివాసం దగ్గర ఆర్జేడీ కార్యకర్తల కాపలా కొనసాగుతోంది.

