కోల్కతాలోని ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు 4 వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVMs) దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాదంపై రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రమాదవశాత్తు జరిగిందా? లేదంటే ఉద్దేశపూర్వకంగా విధ్వంసం సృష్టించారా? అన్నదానిపై సందిగ్ధం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై అత్యవసర సేవల శాఖ సహాయ మంత్రి కౌశిక్ చౌధురి అనుమానం వ్యక్తం చేశారు.
బుధవారం దక్షిణ కోల్కతాలోని తొమ్మిది అంతస్తుల ప్రభుత్వ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ భవనంలో సౌత్ 24 పరగణాస్ జిల్లా పరిషత్ కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ శాఖలు కూడా ఉన్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి కౌశిక్ చౌధురి మాట్లాడుతూ,, ‘‘సుమారు 4,000 ఈవీఎంలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో ఉపయోగించిన ఈవీఎంలే ఇవి” అని తెలిపారు. అలాగే ఈ అగ్నిప్రమాదం సాధారణ ప్రమాదంలా కనిపించడం లేదని.. ఇందులో విధ్వంసం కోణం కూడా ఉందేమో పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
‘‘మొదట మంటలు రెండో, మూడో అంతస్తుల్లో గుర్తించినప్పటికీ అవి నాలుగో, ఐదో, ఆరో అంతస్తులను పెద్దగా ప్రభావితం చేయకుండా నేరుగా ఏడో, ఎనిమిదో, తొమ్మిదో అంతస్తులకు ఎలా వ్యాపించాయన్నది అనుమానాలకు తావిస్తోంది. మంటలు నాలుగో, ఐదో, ఆరో అంతస్తులను దాటేసి పై అంతస్తులకు ఎలా చేరాయి? ఇది విచారణలో తేలాల్సిన అంశం” అని మంత్రి పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్పష్టత కోసం ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
అగ్నిప్రమాదం సంభవించి దాదాపు 24 గంటలు గడిచినా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగించారు. గురువారం ఉదయం పెద్ద మంటలు కనిపించకపోయినా భవనం లోపల కొన్ని ప్రాంతాల్లో ఇంకా పాకెట్ ఫైర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. భవనం లోపల ఇంకా కొన్ని చోట్ల మంటలు ఉన్నాయని.. వాటిని పూర్తిగా ఆర్పేందుకు కూలింగ్ ప్రక్రియ కొనసాగుతోందని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.
ఎఫ్ఐఆర్ నమోదు.. దర్యాప్తు ప్రారంభం
ఈ ఘటనపై సౌత్ 24 పరగణాస్ జిల్లా యంత్రాంగం అలీపూర్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM) ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఏదీ నిర్ధారణ కాలేదని అధికారులు తెలిపారు.
ఫోరెన్సిక్ బృందాల రంగప్రవేశం
ఘటనాస్థలాన్ని భద్రతా వలయంలోకి తీసుకున్న అధికారులు ప్రవేశాన్ని పరిమితం చేశారు. మంటలు పలు అంతస్తులకు వ్యాపించిన విధానాన్ని విశ్లేషిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు త్వరలో భవనాన్ని పరిశీలించి నమూనాలు సేకరించనున్నారు. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా? అన్నది ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తేలే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
రాజకీయ దుమారం
ఈ ఘటన రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ విధ్వంసం కోణాన్ని కొట్టిపారేయలేమని వ్యాఖ్యానించగా.. బీజేపీ నేత రాకేష్ సింగ్ ఇది ప్రణాళికాబద్ధంగా జరిగిన ఘటన అని ఆరోపించారు. అయితే ఇప్పటివరకు ఆ ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదని అధికారులు స్పష్టం చేశారు. శాస్త్రీయ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగానే తుది నిర్ణయానికి వస్తామని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

