NTV Telugu Site icon

Kolkata Doctor case: వైద్యురాలి మృతిపై కుటుంబ సభ్యులను తప్పుదోవపట్టించిన ఉన్నతాధికారి

Kolkatadoctorcase

Kolkatadoctorcase

కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసు వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్పత్రి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం బాధ్యతలేనట్టుగా కనిపిస్తోంది. వైద్యురాలు అత్యంత దారుణంగా.. అత్యాచారానికి గురై, హత్య చేయబడి అర్ధనగ్నంగా శవమై పడి ఉంటే ఆర్‌జీ కర్ హాస్పిటల్‌ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌కు మాత్రం విచిత్రంగా అర్ధమైంది. వైద్య వృత్తి నుంచి వచ్చి.. ఆస్పత్రిలో ఉన్నతమైన పొజేషన్‌లో ఉన్న అధికారి.. బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కుమార్తె ఆత్మహత్య చేసుకుందని సమాచారం ఇచ్చినట్లుగా తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి మరణవార్తను కుటుంబ సభ్యులకు ఆత్మహత్యగా చెప్పడంతో ఈ కేసు తీవ్రత మరింత కీలకంగా మారింది. దీనిపై తాజాగా మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వైద్యురాలి హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక మందిని పోలీసులు విచారించారు. సోమవారం తెల్లవారుజామున ఏడుగురు జూనియర్ డాక్టర్లను పోలీసులు ప్రశ్నించారు. తాజాగా మంగళవారం పోలీసుల ఎదుట హాజరు కావాలని అసిస్టెంట్ సూపరింటెండెంట్‌కు అధికారులు సమాచారం ఇచ్చారు. విచారణకు పిలువబడిన RG కర్ హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ మరియు డిపార్ట్‌మెంట్ హెడ్ (HoD), చెస్ట్ మెడిసిన్ వింగ్‌‌కు హెడ్‌గా ఉన్నారు. ఆగస్టు 13, మంగళవారం ఉదయం 11 గంటలకు కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసులు విచారణను షెడ్యూల్ ఖరారు చేశారు.

సంఘటన జరిగిన రాత్రి డ్యూటీలో ఉన్న ఇంటర్న్‌లు, హౌస్ సిబ్బంది మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలతో సహా ఏడుగురు జూనియర్ డాక్టర్‌లను ప్రశ్నించిన తర్వాత ఆసుపత్రి అధికారికి సమన్లు ​వచ్చాయి. ఈ ఏడుగురు.. బాధితురాలు హత్యాచారానికి గురి కాకముందు కలిసి డిన్నర్ తిన్నారు. రాబోయే రోజుల్లో ఆర్‌జి కర్ హాస్పిటల్ నుంచి మరింత మంది వైద్యులను పిలిపించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే ప్రాథమిక పోస్ట్‌మార్టం రిపోర్టు ప్రకారం.. బాధితురాలి కళ్లు, నోరు, ప్రైవేటు అవయవాల నుంచి రక్తస్రావం జరిగినట్లుగా తేలినట్లు సమాచారం. అంతేకాకుండా ఇతర భాగాల్లో కూడా గాయాలు ఉన్నట్లుగా తేలింది. అయితే వైద్యురాలిని మొదట హత్య చేసి.. ఆ తర్వాత నిందితుడు అత్యాచారానికి పాల్పడి ఉంటాడని మరో పోలీసు అధికారి వెల్లడించారు.

గురువారం అర్ధరాత్రి వరకు బాధితురాలు కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో ఒలింపిక్స్ గేమ్స్‌ను తన సహచరులతో చూసినట్లుగా తెలుస్తోంది. అనంతరం దాదాపు 2 గంటల ప్రాంతంలో అందరితో కలిసి డిన్నర్ చేసింది. అనంతరం నిద్ర రావడంతో ఆస్పత్రిలోని సెమినార్ హాల్‌లోకి వెళ్లింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున 3-6 గంటల ప్రాంతంలో ఆమె హత్యాచారానికి గురై ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఉదయం బాధితురాలు నగ్నంగా శవమై పడి ఉండడంతో సహచరులు భయాందోళన చెంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇదిలా ఉంటే వైదురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇక వైద్యులు విధులు బహిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు్న్నారు. ఆందోళనలు ఉధృతం కావడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సోమవారం ఉదయం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులకు అల్టిమేటం విధించారు. ఆదివారంలోగా కేసు కొలిక్కి తీసుకురాకపోతే సీబీఐకి అప్పగిస్తానని హెచ్చరించారు.

దర్యాప్తుపై వస్తున్న వందతులను పోలీసులు కొట్టిపారేశారు. ఎవరూ పుకార్లు నమ్మొద్దని.. నిష్పాక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతుందని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఆస్పత్రిలో పనిచేసిన సిబ్బందిని విచారించామని.. అలాగే సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కూడా చేపట్టినట్లు వివరించారు.