Mallikarjun Kharge: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్, విపక్షాలకు మధ్య ‘‘డీలిమిటేషన్’’ వార్ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని నరేంద్రమోడీకి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. లేఖలో డీలిమిటేషన్ పై ప్రభుత్వం ముందుకు వెళ్లే ముందు అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు.
లోక్సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాల సంఖ్యను మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రతీ రాష్ట్రానికి ఇప్పుడున్న లోక్సభ ఎంపీ స్థానాల సంఖ్యను కూడా మరో 25 ఏళ్లు కొనసాగించాలని కోరారు. 2029 లోక్సభ ఎన్నికల నుంచే మహిళలకు లోక్సభలో మూడో వంతు రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ తన మూడో డిమాండ్గా పేర్కొంది.
డీలిమిటేషన్పై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు బుధవారం అన్నారు. పార్లమెంట్ను ఎప్పుడు సమావేశపరచాలనేది కేంద్రం నిర్ణయమని చెప్పారు. ప్రస్తుతం వర్షాకాల సమావేశాలను ఇంకా ప్రోరోగ్ చేయకపోవడంతో మరో సమావేశానికి అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
డీలిమిటేషన్ దేశానికి అత్యంత ప్రాధాన్యమైన అంశమని ఖర్గే పేర్కొన్నారు. ఏప్రిల్ 16, 17 తేదీల్లో జరిగినట్లు ఈ అంశాన్ని బలవంతం చేసే ప్రయత్నం చేయవద్దని ప్రధాని మోడీని ఖర్గే కోరారు. ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసే ముందు రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై తమలో తాము తగినంత చర్చించుకునే అవకాశం కల్పించాలని కోరారు.

