పూణెలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో తవ్వేకొద్దీ కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కేతన్ అగర్వాల్ను హత్య చేయడానికి ముందు రోజు.. అనగా జూన్ 17న కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి పూణెలోని ఓ కేఫేలో సమావేశమై హత్యకు కుట్ర పన్నినట్లుగా పోలీసులు వెల్లడించారు. జూన్ 18న లోహగడ్ కోట సమీపంలోని లోయలో కేతన్ అగర్వాల్ను తోసివేయడానికి ఒక రోజు ముందు ఈ సమావేశం జరిగినట్లు దర్యాప్తులో తేలింది.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. జూన్ 17న సియా, చేతన్ పూణెలోని ఒక కేఫేలో కలుసుకుని హత్య ప్రణాళికపై చర్చించారు. లోహగడ్ కోట ప్రాంతానికి సంబంధించిన వివరాలను సియా చేతన్కు అందించడంతో పాటు యూట్యూబ్ వీడియోల ద్వారా ఆ ప్రాంతాన్ని పరిశీలించినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్లో ఇద్దరూ సాయంత్రం 4:35 గంటల సమయంలో కేఫేలోకి ప్రవేశించి.. సుమారు 5:30 గంటలకు బయటకు వచ్చినట్లు కనిపించింది.
25 ఏళ్ల కేతన్ అగర్వాల్ తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ‘సక్సెస్ గ్రూప్’లో డైరెక్టర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సియా గోయల్తో నిశ్చితార్థం జరగగా.. నవంబర్ 25న వీరి వివాహం జరగాల్సి ఉంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఘనంగా పెళ్లి నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందుకోసం కేతన్ కుటుంబం రూ.17 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా అతిథుల కోసం రెండు విమానాలు కూడా బుక్ చేశారు. భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జూన్ 18న లోహగడ్ కోట దగ్గర ట్రెక్కింగ్కు వెళ్లిన సమయంలో కేతన్ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడని సియా మొదట పోలీసులకు తెలిపింది. బలమైన గాలుల మధ్య ఫొటోలు తీసుకుంటుండగా జారి పడిపోయాడని ఆమె చెప్పడంతో పోలీసులు తొలుత ప్రమాద మరణంగా కేసు నమోదు చేశారు. మూడు గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం కేతన్ మృతదేహాన్ని వెలికితీశారు. అయితే దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ సియా వాంగ్మూలంలో పలు వైరుధ్యాలు కనిపించాయి. మొదట ఫొటోలు తీస్తుండగా పడిపోయాడని చెప్పిన ఆమె.. తర్వాత కోట ఎక్కిన అనంతరం విశ్రాంతి తీసుకుంటుండగా నీటి బాటిల్ ఇస్తూ జారి పడిపోయాడని మరో కథనం చెప్పింది. ఈ రెండు వాంగ్మూలాలు భిన్నంగా ఉండటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తొలుత కేతన్ కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. అల్లరి చేయొద్దని.. ఇంతటితో వదిలేయమని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే దర్యాప్తులో భాగంగా పోలీసులకే దర్యాప్తు వేగవంతం చేశారు.
అయితే దర్యాప్తులో భాగంగా కీలక మలుపు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. లోహగడ్ కోట మార్గంలో కేతన్, సియాతో పాటు ఒక హూడీ ధరించిన వ్యక్తి కనిపించాడు. సియా తరచూ వెనక్కి తిరిగి అతడిని చూడటం, ఒక దశలో చేతి సంకేతం చేయడం కూడా ఫుటేజ్లో రికార్డైంది. తర్వాత మొబైల్ లొకేషన్ డేటా, కాల్ డిటైల్ రికార్డులు, ప్రయాణ వివరాల ఆధారంగా ఆ వ్యక్తి చేతన్ చౌదరి అని పోలీసులు గుర్తించారు.
పోలీసుల ప్రకారం.. చేతన్ కేతన్, సియా కంటే ముందే లోహగడ్ కోటకు చేరుకుని కేవలం 48 నిమిషాల పాటు అక్కడ గడిపి వెళ్లిపోయాడు. ఇది సాధారణ ట్రెక్కింగ్ కంటే ఒక నిర్దిష్ట ఉద్దేశంతో వచ్చినట్లు సూచిస్తోందని అధికారులు భావిస్తున్నారు. అయితే చేతన్ను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ లొకేషన్ డేటా, కాల్ రికార్డులు, డిజిటల్ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలను సమన్వయం చేసి కేసును ఛేదించినట్లు తెలిపారు. విచారణలో ఇద్దరూ తమ పాత్రను అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ.. కేవలం ఒప్పుకోళ్లపై ఆధారపడకుండా సాంకేతిక ఆధారాలను కూడా సేకరించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి పోలీసు కస్టడీలో ఉండగా.. కేతన్ హత్యకు దారితీసిన పూర్తి పరిణామ క్రమాన్ని వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కుట్రలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
Pune – Chilling details have emerged in the sensational Lohagad Fort murder case, revealing that the conspiracy to kill 26-year-old Ketan Agarwal was allegedly finalised at a prominent cafe in Pune’s Kondhwa area. According to police investigations, accused Siya Goyal and her… pic.twitter.com/o4vBQVEDhB
— NextMinute News (@nextminutenews7) June 25, 2026

