Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!

  • కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం
  • సియా, సోనమ్‌కు ఉరిశిక్షే పడాలంటూ డిమాండ్
  • ముస్కాన్‌ కూడా చంపేయాలని వినతి
Ketanagarwalcase5

Ketanagarwalcase5

పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన హనీమూన్ మర్డర్ కేసుకు దగ్గరగా ఉండడంతో రెండు కేసుల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. తాజాగా కేతన్ హత్య కేసుపై భార్య సోనమ్ రఘువంశీ చేతిలో హత్యకు గురైన రాజా రఘువంశీ కుటుంబం స్పందించింది. కేతన్ హత్యకు, రాజా హత్యకు చాలా పోలికలు ఉన్నాయని.. నిందితులు సియా గోయల్, సోనమ్ రఘువంశీ ఇద్దరికీ ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసింది.

సోనమే కారణం..


మీడియాతో మాట్లాడిన రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ.. ప్రస్తుతం జరుగుతున్న ఇలాంటి ఘటనలు ఇతర యువతులను కూడా ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి అమ్మాయిలు చేస్తున్న పనులను చూసి మరికొందరికి కూడా ధైర్యం వస్తోంది. పూణెలో జరిగిన ఘటన కూడా అలాగే జరిగింది. నా కుమారుడు రాజాను ఎలా కొండపై నుంచి తోసేశారో.. అదే తరహాలో కేతన్‌ను కూడా లోయలోకి నెట్టేశారు. ఇది చాలా బాధాకరం.’’ అని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉమా రఘువంశీ డిమాండ్ చేశారు.

‘‘సోనమ్, ముస్కాన్, సియా వంటి వారికి ఉరిశిక్ష విధించినప్పుడే ఇలాంటి ఘటనలు ఆగుతాయి. సోనమ్ జైలు నుంచి బయటకు రావడమే సియాకు ధైర్యం ఇచ్చి ఉండొచ్చు. కేవలం 11 నెలల్లోనే ఆమె ఎలా బయటకు వచ్చింది? ఆమె కేసు ఎందుకు వేగంగా విచారణకు రావడం లేదు? మళ్లీ జైలుకు ఎందుకు పంపలేదు? సోనమ్ బయటకు రావడాన్ని చూసే తాను కూడా తప్పించుకోగలనని సియా భావించి ఉండొచ్చు.’’ అని వ్యాఖ్యానించారు.

రాజా సోదరుడి కీలక వ్యాఖ్యలు

రాజా రఘువంశీ సోదరుడు విపిన్ రఘువంశీ కూడా రెండు ఘటనల మధ్య పోలికలు ఉన్నాయని అన్నారు. ‘‘నా సోదరుడిని కూడా ఇలాగే హత్య చేశారు. అప్పట్లో సోనమ్ కుటుంబం ఆమెకు శిక్ష పడేలా చేస్తామని చెప్పింది. కానీ తర్వాత ఆమెను జైలు నుంచి బయటకు తీసుకొచ్చి కాపాడింది. ఇప్పుడు సియా తండ్రి కూడా ఒకవేళ తన కుమార్తె దోషి అయితే శిక్షించాలని చెబుతున్నారు. కానీ సోనమ్‌కు కఠిన చర్యలు తీసుకుని ఉంటే.. సియా ఇలాంటి నేరానికి పాల్పడే ధైర్యం చేసేది కాదేమో.’’ అని అన్నారు.

కేతన్ అగర్వాల్‌ను.. కాబోయే భార్య సియా గోయల్, ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. జూన్ 18న లోహగడ్ కోటకు ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో లోయలోకి తోసివేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరూ జూన్ 29 వరకు పోలీసు కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి నిందితులకు ఉరిశిక్ష విధించాలని కోరారు. ఈ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షించి, దోషులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చూస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ తెలిపారు.