దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. కానీ కీలకమైన ఆధారాలను మాత్రం ఇప్పటి వరకు సేకరించలేనట్లుగా తెలుస్తోంది. గతేడాది హనీమూన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్పై దర్జాగా తిరుగుతోంది. సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు కేతన్ అగర్వాల్ కేసు కూడా అదే మాదిరిగా అయ్యేటట్లు కనిపిస్తోంది. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిని దోషులుగా తేల్చేందుకు సరైన ఆధారాలు దొరకలేదని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ కేసు కూడా హనీమూన్ కేసులా అయ్యేటట్టు కనిపిస్తోంది.
జూన్ 18న పూణెలోని పురాతన కొండపై నుంచి కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను సియా గోయల్ తన ప్రియుడు చేతన్తో కలిసి చంపేసింది. ఈ హత్య దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో పోలీసులకు ఎలాంటి ప్రత్యక్ష సాక్షులు దొరకలేదు. అలాగే ఆధారాలు కూడా లభించలేదు. దీంతో ఈ కేసు బలహీనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ప్రఖ్యాత న్యాయవాది ఉజ్జ్వల్ నికమ్ కేతన్ తరఫున వాదించనున్నారు. పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాతే ఆయన తన వాదనను ప్రారంభించనున్నారు.
మేఘాలయ పోలీసుల చిన్న పొరపాటు వల్ల సోనమ్ రఘువంశీ విడుదలైంది. కానీ ప్రశ్న ఏమిటంటే.. పూణె పోలీసులు సియాను శిక్షించగలరా? ఈ ప్రశ్న తలెత్తడానికి కారణం.. కేతన్ హత్య కేసులో చేతన్, సియాల వాంగ్మూలాలు తప్ప, సియా లేదా చేతన్లో ఎవరు కేతన్ను లోయలోకి తోశారో నిరూపించగల ఒక్క పక్కా ఆధారం గానీ.. సాక్షి గానీ పూణె పోలీసుల దగ్గర లేకపోవడం. సియా, చేతన్ల సంగతి పక్కన పెడితే.. కేతన్ ప్రమాదవశాత్తు గుంతలోకి జారిపడ్డాడా లేక తోయబడ్డాడా అని నిరూపించడం ప్రస్తుతం పోలీసులకు కష్టంగా మారింది. ఇక ఘటన జరిగిన చోట ఎలాంటి సీసీకెమెరాలు లేవు. ప్రత్యక్షంగా చూసిన వాళ్లు లేరు. దీంతో కేసు బలహీనపడింది. ఇక సియా-చేతన్ మొబైల్స్ను పరిశీలించాక ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నట్లు తేలింది. కానీ అంతకు మంచిన ఆధారాలు లభించలేదు.
ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధం లేకుండా కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. సియా, కేతన్ల పెళ్లి తర్వాత సియా సోదరుడు సాహిల్-కేతన్ సోదరిల పెళ్లి గురించి కూడా చర్చలు జరుగుతున్నాయని వెల్లడైంది. ఇరు కుటుంబాలు ఈ విషయంపై చర్చిస్తున్నాయి. జూన్ 6న కేతన్, సియా ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం బాలికి వెళ్తున్నప్పుడు.. సాహిల్, కేతన్ సోదరి కూడా వారితో పాటే వెళ్లారు. సియా సోదరుడి పెళ్లి విషయమై కేతన్ కుటుంబంతో చర్చలు జరుగుతున్నాయని సియా తండ్రి స్వయంగా సూచించారు. మొత్తానికి కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితులైన సియా, చేతన్ను దోషులుగా తేల్చేందుకు పోలీసులు ఏం చేస్తారో చూడాలి.
ఇదిలా ఉంటే నిందితులకు కఠిన శిక్ష పడాలని కేతన్ కుటుంబ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ను కలిసి విన్నవింంచారు. ఇక ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు లేఖలు రాశారు.

