Kerala: ఆడుకుంటూ పడిపోవడంతో పెదవికి గాయమైందని హాస్పిటల్ తీసుకెళ్తే, 18 నెలల బాలుడు మరణించిన సంఘటన కేరళలో జరిగింది. బాలుడికి అనస్తీషియా ఇచ్చిన తర్వాత అపాస్మారక స్థితికి చేరుకుని చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై చిన్నారి కుటుంబం వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. మరోవైపు, ఆస్పత్రి యాజమాన్యం మాత్రం బాలుడు కార్డియాక్ అరెస్ట్ వల్ల మరణించినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కన్నూర్ జిల్లాలోని ఎరమం కుట్టూర్కు చెందిన సూరజ్, విజయిష దంపతుల ఏకైక కుమారుడు దేశాంశ్ శౌర్య జూలై 5న ఇంటి బయట ఆడుకుంటూ కిందపడటంతో పెదవికి గాయమైంది. కుటుంబ సభ్యులు తొలుత మథమంగళంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా, అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం పయ్యన్నూర్ లోని బేబీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పెదవికి కుట్లు వేయడానికి చిన్నారికి అనస్తీషియా ఇచ్చారు. అనస్తీషియా ఇచ్చిన తర్వాత చిన్నారి స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత కన్నూర్లోని బేబీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయినప్పటికీ బాలుడు శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో మరణించాడు.
ఈ ఘటనలో వైద్యురాలు అంజలి పొదువల్ నిర్లక్ష్యం కారణమని బాలుడి కుటుంబం ఆరోపిస్తోంది. డాక్టర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, అనస్తీషియా ఇచ్చిన వెంటనే చిన్నారికి ఊహించనిరీతిలో కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) వచ్చిందని, వెంటనే వెంటిలేటర్ సపోర్ట్ అందించి కన్నూర్ ఆస్పత్రికి తరలించినట్లు ఆస్పత్రి యాజమాన్యం చెప్పింది. సరైన మోతాదులో అనస్తీషియా ఇచ్చిన, చాలా అరుదుగా ఇలాంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉందని ఆస్పత్రి పేర్కొంది. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

