కేరళంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం ఏర్పడ లేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. దీంతో ముఖ్యమంత్రి ఎంపిక ఈజీగానే జరగొచ్చని అంతా భావించారు. తమిళనాడులో చోటుచేసుకున్నంత గందరగోళం లేకపోవచ్చని అనుకున్నారు. కానీ తమిళనాడు కంటే కేరళంలోనే పెద్ద తలనొప్పి నెలకొంది. ముఖ్యమంత్రి పదవి కోసం ముగ్గురు కీలక నేతలు రేసులోకి వచ్చారు. ఎవరిని ఎంపిక చేయాలో తెలియక అధిష్టానం తలమునకలవుతోంది. తొలుత కేసీ.వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపించింది. అనంతరం సతీశన్, రమేష్ చెన్నితాల పేర్లు తెరపైకి రావడంతో పార్టీలో వర్గపోరు మొదలైంది. ఈ నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాక హైకమాండ్ తర్జన భర్జన పడుతోంది.
ఈ గందరగోళం మధ్య స్వయంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువగా కేసీ వేణుగోపాల్కే ఉన్నట్లు గుర్తించింది. మరోవైపు వీడీ సతీశన్కు కేరళ స్థాయి కార్యకర్తల మద్దతు బలంగా ఉందని, ప్రియాంకా గాంధీ కూడా ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం తీవ్ర గందరగోళం నెలకొనడంతో కాంగ్రెస్ హైకమాండ్ మాజీ కేరళ పీసీసీ అధ్యక్షులు వీఎం సుధీరన్, ముళ్లపల్లి రామచంద్రన్లతో చర్చలు ప్రారంభించింది. సీనియర్ నేత ఏకే.ఆంటోనీ కూడా ఈ ప్రక్రియలో కీలక సలహాదారుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా వేణుగోపాల్, సతీశన్ అనుచరులు రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్ వార్, నిరసనలు, బహిరంగ మద్దతు ప్రదర్శనలు చేపట్టడం పార్టీకి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా సతీశన్కు అనుకూలంగా జరుగుతున్న దూకుడు ప్రచారం ఆయన అవకాశాలను దెబ్బతీసి ఉండొచ్చని కొందరు నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటికే కాంగ్రెస్ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా సమావేశమై సీఎం ఎంపికపై అభిప్రాయాలు సేకరించారు. పార్టీ వర్గాల ప్రకారం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్కు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. ఆయనకే ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
140 సభ్యుల కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమి 102 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 63 స్థానాలు దక్కించుకోగా, ముస్లిం లీగ్ 22 స్థానాలు, కేరళ కాంగ్రెస్ 8 స్థానాలు, విప్లవ సోషలిస్టు పార్టీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే భారీ విజయాన్ని సాధించినప్పటికీ సీఎం ఎంపికపై కొనసాగుతున్న అనిశ్చితి ఇప్పుడు యూడీఎఫ్ విజయోత్సాహాన్ని మసకబార్చుతోంది.
