కర్ణాటకలో 6 లక్షల ట్రక్కులు సమ్మెలోకి దిగాయి. దీంతో నిత్యావసర సామాగ్రి నిలిచిపోయాయి. ఇక సమ్మెకు 24 రాష్ట్రాల నుంచి రవాణాదారులు మద్దతు ప్రకటించారు. పాలు తరలించే ట్రక్కులు తప్ప.. మిగిలిన అన్ని ట్రక్కులు రోడ్లపైకి రావని రవాణా సంఘాలు తెలిపాయి. నిత్యావసరాలు, నిర్మాణ సామగ్రి, పెట్రోల్, ఎల్పీజీ, ఇతర వస్తువులను రవాణా చేసే ట్రక్కులు కూడా సమ్మెలో పాల్గొన్నాయి. కర్ణాటక రాష్ట్ర లారీ యజమానులు మరియు ఏజెంట్ల సంఘం ఆధ్వర్యంలో దాదాపు ఆరు లక్షల మంది ట్రక్కర్లు ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగాయి. ఇంధన ధరల పెరుగుదల, టోల్ ప్లాజాల్లో వేధింపులకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మెను ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Vijay sethupathi : స్క్రిప్ట్ నచ్చితే చాలు.. డైరెక్టర్ గురించి పట్టించుకోను
పాలు రవాణా చేసే ట్రక్కులు తప్ప మిగతా అన్ని ట్రక్కులు రోడ్లపై తిరగవని అసోసియేషన్ తెలిపింది. 24 రాష్ట్రాల నుంచి 60 కి పైగా రవాణా సంఘాలు సమ్మెకు మద్దతు ఇచ్చాయని పేర్కొన్నారు. నిరసన సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి ట్రక్కులు కర్ణాటకలోకి ప్రవేశింపవని పేర్కొంది.
‘‘కర్ణాటక ప్రభుత్వం కేవలం ఏడు నెలల వ్యవధిలో రెండుసార్లు డీజిల్ ధరను పెంచింది. దీని వలన నిర్వహణ ఖర్చులు పెరిగాయి. ట్రక్కర్లు నడపడానికి ఇబ్బంది పడుతున్నారు. డీజిల్ ధరల పెరుగుదల కర్ణాటకలోని ప్రతి పౌరుడిని ప్రభావితం చేసింది.’’ అని అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఆర్. షణ్ముగప్ప తెలిపారు.
సమ్మె కారణంగా కర్ణాటక నుంచి తమిళనాడుకు రోజుకు 4,000 లోడ్ల కూరగాయలు, బియ్యం, మందులు మరియు ఇతర నిత్యావసర వస్తువుల సరఫరా నిలిచిపోయాయి. ‘‘కోలార్ మరియు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల నుంచి కూరగాయల కోసం.. ముఖ్యంగా టమోటాల కోసం ట్రక్కులపై ఎక్కువగా ఆధారపడే చెన్నైకు కష్టాలు తప్పవని షణ్ముగప్ప హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: TTD: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చర్యలు..
తమిళనాడులో ప్రస్తుతం టమోటాలు కిలోకు దాదాపు రూ. 25 కు అమ్ముడవుతున్నాయి. సరఫరా నిలిచిపోవడంతో అంతరాయం కలిగి ధరలు అమాంతంగా పెరిగిపోవచ్చు. సమ్మె కారణంగా మహారాష్ట్ర నుంచి వచ్చే ట్రక్కులు.. ముఖ్యంగా నాసిక్ నుంచి ఉల్లిపాయలను తీసుకొచ్చే ట్రక్కులు ఆలస్యం కావడం పట్ల వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ప్రతిరోజూ దాదాపు 15,000 ట్రక్కులు కర్ణాటక గుండా వెళుతున్నాయని బెంగళూరు కమర్షియల్ ట్రక్ అసోసియేషన్ రాజేష్ గుర్తించారు.
డిమాండ్లు ఇవే..
ఇక కర్ణాటకలో టోల్ వసూలును రద్దు చేయడం, రాష్ట్ర సరిహద్దుల్లో ఆర్టీవో చెక్పోస్టులను తొలగించడం, ఫిట్నెస్ సర్టిఫికెట్ పునరుద్ధరణకు రూ. 15,000 వసూలు చేయాలన్న కేంద్రం ఆదేశాన్ని ఉపసంహరించుకోవడం వంటి ఇతర అనేక డిమాండ్లను కూడా అసోసియేషన్ లేవనెత్తింది. బెంగళూరులో ట్రక్కులకు ‘‘నో ఎంట్రీ’’ పరిమితిని సడలించడం కూడా ఒక ముఖ్యమైన డిమాండ్గా ఉంది.