రోజురోజుకూ కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయి. రక్తసంబంధుల మధ్యే మానవత్వం మంటగలుస్తోంది. ప్రస్తుతం ఎవరినీ.. ఎవరు నమ్మడానికి అవకాశం ఉండడం లేదు. అయినవాళ్లే ప్రాణాలు తీయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తాజాగా కర్ణాటకలోని ధారవాడలో దారుణం జరిగింది. ప్రముఖ వైద్యుడు కిరణ్ హొన్నన్నవర్ను ఆయన భార్య, డాక్టర్ ప్రియాంక కట్టనహళ్లి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో 8 ఏళ్ల కుమారుడిపై కూడా కత్తితో దాడి చేయగా.. బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బుధవారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అపార్ట్మెంట్లో భయానక దృశ్యాలు కనిపించాయి. ఇంటి లోపల అంతా రక్తపు మరకలు కనిపించగా… ఒక గదిలో డాక్టర్ కిరణ్ రక్తపు మడుగులో మృతదేహంగా పడి ఉండగా.. పక్కనే తీవ్ర గాయాలతో కుమారుడు కనిపించాడు. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే.. అదే సమయంలో డాక్టర్ ప్రియాంక మంచంపై పడుకుని మొబైల్ ఫోన్లో స్క్రోల్ చేస్తూ కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే హుబ్బళ్లి-ధారవాడ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ ఘటనాస్థలికి చేరుకున్నారు. మొదట స్పందించిన సిబ్బందికి బాలుడు చనిపోయినట్లు అనిపించినా… కమిషనర్ అతను ఇంకా శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. మంగళవారం రాత్రి-బుధవారం ఉదయం డాక్టర్ కిరణ్కు బంధువులు, స్నేహితులు పలుమార్లు ఫోన్ చేశారు. ప్రతి సారి ప్రియాంకే ఫోన్ ఎత్తి… మొదట ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని.. తర్వాత విధులకు వెళ్లారని చెప్పినట్లు సమాచారం. అయితే సాయంత్రం కూడా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు నేరుగా అపార్ట్మెంట్కు వెళ్లగా.. భర్త మృతదేహం, గాయపడిన కుమారుడు కనిపించారు. అదే సమయంలో ప్రియాంక గదిలో ప్రశాంతంగా మొబైల్ చూస్తూ ఉండటంతో దిగ్భ్రాంతికి గురి చేసింది.
పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ స్థానిక చిరాయు ఆస్పత్రిలో అనస్థీషియా నిపుణుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య ప్రియాంక ఎంబీబీఎస్ పూర్తి చేసి… ఆఫ్తాల్మాలజీలో ఎంఎస్ చేశారు. కుమారుడితో కలిసి ధారవాడలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఘటన జరిగిన సమయంలో ఇంట్లో భర్త, భార్య, కుమారుడు మాత్రమే ఉన్నట్లు తేలిందని, బయట వ్యక్తులు ఇంట్లోకి వచ్చిన ఆనవాళ్లు ఇప్పటివరకు లభించలేదని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన ఎప్పుడు జరిగింది? హత్యకు దారితీసిన కారణాలేమిటి? ప్రియాంక ఎవరితో మాట్లాడింది? కుటుంబ సభ్యులకు ఎందుకు తప్పుదారి పట్టించే సమాచారం ఇచ్చింది? వంటి అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

