Another youth killed in karnataka: కర్ణాటక వరస హత్యలతో అట్టుడుకుతోంది. వరసగా రోజుల వ్యవధిలో ఇరు వర్గాలకు చెందిన ఇద్దరు యువకులను దుండగులు దారుణంగా హత్య చేశారు. దీంతో కర్ణాటక వ్యాప్తంగా ఒక్కసారిగా ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే బెల్లారే ప్రాంతంలో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టార్ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. తాజాగా గురువారం మంగళూర్ శివార్ లోని సూరత్ కల్ ప్రాంతంలో ఫాజిల్ (30) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ప్రస్తుతం ఈ హత్య కలకలం రేపుతోంది.
సూరత్ క్ల్ లోని ఓ వస్త్రదుకాణం బయట మహ్మద్ ఫాజిల్ ను గుర్తు తెలియని దుండగుల ముఠా కత్తితో పొడిచి చంపింది. కర్ణాటక ముఖ్యమంత్రి ఇటీవల హత్య చేయబడ్డ ప్రవీణ్ నెట్టార్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న సమయంలోనే ఈ హత్య జరిగింది. సూరత్ కల్ ప్రాంతంలోని మంగల్ పేట ప్రాంతంలో ఈ దాడి జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఫజిల్ ను ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మరణించాడు. ప్రవీణ్ నెట్టార్ హత్య జరిగిన నేపథ్యంలో ఈ హత్య జరగడం సంచలనంగా మారింది.
Read Also: Rashtrapatni Row: కాంగ్రెస్ ఎంపీకి మహిళా కమిషన్ నోటీసులు..
ఈ హత్యతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సూరత్ కల్, ముల్కి, బజ్ పే పనంబూర్ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు. మంగళూర్ కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్ షాపులు జూలై 29 వరకు మూసివేశారు. ప్రతీ ప్రాంతంలో గట్టి బందోబస్త్ ను ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల కారణంగా ముస్లిం నాయకులు, ముస్లింలు అంతా తమ ఇళ్లలోనే ప్రార్థన చేసుకోవాలని పోలీసులు కోరారు. ఫజిల్ హత్య వెనక ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని.. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని పోలీసులు కోరారు. మృతుడికి సత్వర న్యాయం జరుగుతుందని పోలీసులు హామీ ఇచ్చారు.