Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు

  • ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’
  • వాళ్ల సలహాలు తీసుకోవాల్సిన పని లేదు
  • తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
Kangana Ranaut

Kangana Ranaut

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తన నోటికి పని చెప్పారు. సహచర బాలీవుడ్ నటులపై ఘాటు వ్యా్ఖ్యలు చేశారు. ఇటీవల యోగా గురువు బాబా రామ్‌దేవ్‌పై తీవ్రంగా స్పందించిన కంగనా.. ఇప్పుడు తోటి నటీనటులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాప్సీ, అశోతోష్ రాణా, సోనూ సూద్‌, రాఖీ సావంత్, బాబా రామ్‌దేవ్‌పై కంగనా విరుచుకుపడ్డారు. తన కంటే ఎక్కువ విజయం సాధించిన వారి నుంచే తాను సలహాలు తీసుకుంటాను గానీ.. విఫలమైన వారు, అసహ్యమైన వారి నుంచి సలహాలు తీసుకోను అని వ్యాఖ్యానించారు. తనను విమర్శించే స్థాయి వారికి లేదన్నారు.

‘‘నేను ప్రతిరోజూ ఇలాంటి వాళ్లను చూస్తుంటాను. నేను కుక్కలా మొరుగుతానని చెప్పే అశుతోష్ రాణా అయినా.. నేను ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలని చెప్పే సోనూ సూద్ అయినా.. నా వ్యక్తిత్వం గురించి అన్ని రకాల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసే రాఖీ సావంత్ లాంటి వాళ్లైనా.. నా తల్లిదండ్రులను, నా పెంపకాన్ని, నా నేపథ్యాన్ని నిరంతరం అవమానిస్తూ ఉండే తాప్సీ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఈ వ్యక్తులకు నేను చెప్పే సందేశం ఒక్కటే.. నా జీవితంలో నేను సాధించిన విజయంలో ఒక్క శాతం కూడా మీరు సాధించకపోతే… నేను మీ సలహాలను అస్సలు వినను. ఈ పనికిమాలిన వ్యక్తులు కేవలం ప్రచారం కోసమే మీడియాలో నన్ను నిరంతరం దూషిస్తూ ఉంటారు.’’ అని దుయ్యబట్టారు.

పనిలో పనిగా మరోసారి బాబా రామ్‌దేవ్‌పై కూడా మండిపడ్డారు. ఆయన అన్ని హద్దులు దాటారని ఆరోపించారు. ‘‘ఈ ఆకలితో ఉన్న.. నిస్సహాయులైన ప్రజలు నాపై విరుచుకుపడలేరు. వారు తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టరు. అశుతోష్ రాణా లాంటి వాళ్లు నేను కుక్కలా మొరుగుతానని అంటారు. ముందు మీరే కంగనా రనౌత్ అవ్వండి. నేను నాకంటే ఎక్కువ విజయం సాధించిన వారి నుంచి సలహాలు తీసుకుంటాను. విఫలమైన, తెలివితక్కువ, అసహ్యకరమైన వ్యక్తుల నుండి నేను సలహాలు తీసుకోను..’’ అని పేర్కొన్నారు.

వివాదం ఇలా..

ఇటీవల ఢిల్లీ వేదికగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే ఈ ఉద్యమంపై కంగనా స్పందిస్తూ.. విద్యార్థులను ‘మురికి తరం’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపాయి. దీనిపై బాబా రామ్‌దేవ్ స్పందిస్తూ.. ‘‘ఆమె గతంలో చేసిన పనులు ఎలా ఉండేవి. ఆమె యవ్వనం ఎలా ఉండేది?, అయినా కలుషితమైన మనస్తత్వం కలిగిన గురించి మాట్లాడను.’’ అని అన్నారు. దీనికి కంగనా కౌంటరిచ్చారు. ‘‘బాబాజీ.. నా యవ్వనం లేదా పడకగది గురించి పగటి కలలు కనకండి. పుకార్లు, గాసిప్‌ల ఆధారంగా మాత్రమే ఊహించుకోవాలి.’’ అని రాశారు.

ఇక తాప్సీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ కంగనాను కలవలేదని.. తన అభిప్రాయం ప్రకారం.. ఆమె మాటలు వింటుంటే.. ఆమె పెంపకంలోనే ఏదో తేడా ఉందని వ్యాఖ్యానించారు. ఇలా కంగనా వర్సెస్ సెలబ్రిటీలు, ప్రముఖల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనికి ఎప్పుడు పుల్‌స్టాప్ పడుతుందో చూడాలి.