ఢిల్లీలో జరుగుతున్న న్యాయ సదస్సులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలి. లక్ష్మణ రేఖను దాటడం మంచిది కాదన్నారు. న్యాయమూర్తులు విధి నిర్వహణలో పరిధులు గుర్తించాలి. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థకు వేర్వేరు అధికారాలు ఉన్నాయన్నారు.
ప్రజాస్వామ్యం బలోపేతానికి 3 వ్యవస్థలు పనిచేయాలి. పిల్లు దుర్వినియోగం అవుతున్నాయి. పిల్లు వ్యక్తిగత వ్యాజ్యాలుగా మారాయన్నారు సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరం అన్నారు. న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ రెండు పరస్పర సహకారంతో ముందుకు వెళ్ళాలి. ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని అందరూ గౌరవించాల్సిందే అన్నారు. వార్డ్ మెంబర్ నుంచి లోక్ సభ సభ్యుడి వరకు అందరిని గౌరవించాలన్నారు.
అందరి విషయంలో చట్టం సమనంగా ఉంటుంది. క్షేత్ర స్థాయిలో అధికారవర్గం తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే కోర్టుల్లో కేసులు తగ్గుతాయి. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను కొందరు దుర్వినియోగ పరుస్తున్నారు. త్వరితగతిన కేసుల పరిష్కారానికి మరింత సిబ్బంది అవసరం అన్నారు. కోర్టుల్లో మానవ వనరుల కొరత తీరితే కేసుల భారం తగ్గుతుంది. కోర్టుల ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయన్నారు.
