Site icon NTV Telugu

Congress: ఓటమి ఫలితం.. కమల్‌నాథ్ స్థానంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా జితూ పట్వారీ..

Congress

Congress

Congress: ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే గతంలో పోలిస్తే ఈ సారి మరింత ఘోరంగా కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ ఓటమి కారణంగా రాష్ట్ర పీసీసీ చీఫ్ కమల్ నాథ్‌ని మారుస్తుందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

అయితే తాజాగా శనివారం రోజు కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‌గా కమల్ నాథ్‌ని తొలగించి, ఆయన స్థానంలో జితూ పట్వారీని నియమించింది. జితు పట్వారినీ తక్షణమే రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ.. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడి పేరిట ఆదేశాలు జారీ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా కమల్ నాథ్ అందించిన సేవల్ని పార్టీ అభినందిస్తోందని ఒక ప్రకటనలో కాంగ్రెస్ తెలిపింది. రవ్ నియోజకవర్గం నుంచి 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందిన జితు పట్వారీ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి మధు శర్మ చేతిలో ఏకంగా 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్‌గా పనిచేశారు.

Read Also: Solar flare: సూర్యుడి నుంచి ఎగిసిపడిన అతిపెద్ద సౌరజ్వాల.. భూమి వైపు దూసుకొస్తోంది..

పీసీసీ చీఫ్‌తో పాటు ఉమంగ్ శింగార్‌ని ప్రతిపక్ష నేతగా, హేమంత్ కటారేని మధ్యప్రదేశ్ విధానసభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్‌గా నియమించింది.పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోనున్న జితూ పట్వారీ, గతంలో కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉన్నతవిద్యా, యువజన, క్రీడా మంత్రిగా పనిచేశారు. 2018లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపిసిసి) చీఫ్‌గా కమల్ నాథ్ నియమితులైనప్పుడు, పట్వారీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. 230 స్థానాలు ఉన్న ఎంపీ అసెంబ్లీలో బీజేపీ 163 స్థానాలను గెలుచుకుంటే.. కాంగ్రెస్ కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహన్ స్థానంలో కొత్తగా మోహన్ యాదవ్‌ని సీఎంగా చేసింది.

Exit mobile version