Jaishankar: రష్యా చమురు కొనుగోలుపై వెస్ట్రన్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలకు మరోసారి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. భారత్ రాజకీయ కారణాలతో కాకుండా, అవసరాలు, మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. చమురు ఖర్చులు, లభ్యత ఆధారంగా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఫిన్లాండ్లో కుల్తరాంతా టాక్స్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2022లో రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్లో మార్పులు చోటుచేసుకున్నాయని, యూరప్ దేశాలు మిడిల్ ఈస్ట్ నుంచి భారీగా కొనుగోలు చేయడంతో భారత్ ప్రత్యామ్నాయంగా రష్యా చమురును వైపు వెళ్లాల్సి వచ్చిందని జైశంకర్ చెప్పారు.
భారత వాదనకు ఫిన్లాండ్ నుంచి మద్దతు లభించింది. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలినా వాల్టోనెస్ భారత్కు మద్దతుగా నిలిచారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత వెస్ట్రన్ దేశాలు అమలు చేసిన చమురు ధర పరిమితి నిబంధనలకు లోబడే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. చమురు ధర పరిమితి విధించడం వెనక ఉద్దేశం ప్రపంచ దేశాలు రష్యా చమురును పూర్తిగా కొనకుండా ఆపడం కాదని, చమురు సరఫరా కొనసాగుతూనే రష్యాకు అధిక లాభాలు రాకుండా చూడటమే లక్ష్యమని ఆమె చెప్పారు.
ఇదే సమయంలో, రష్యా ఆయిల్ కొనుగోలు చేయమని అమెరికానే చెప్పిందని జైశంకర్ అన్నారు. ప్రపంచ ఇంధన మార్కెట్లో చోటుచేసుకున్న మార్పుల కారణంగా భారత్ తన ఇంధన వనరుల్ని విస్తరిస్తోందని జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం మా అతిపెద్ద చమురు సరఫరా దారు రష్యా, సహజ వాయువు సరఫరాలో అమెరికా మొదటి స్థానంలో ఉందని, ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఈ స్థానంలో ఖతార్ ఉండేదని ఆయన వెల్లడించారు. గల్ఫ్ దేశాలతో భారత్ సంబంధాలు కేవలం చమురు వరకే పరిమితం కావని, అవి వ్యూహాత్మకంగా కూడా ఎంతో కీలకమని ఆయన వివరించారు.

