NTV Telugu Site icon

Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ నోట మళ్లీ “ఖలిస్తాన్” మాట.. తన తల్లి వ్యాఖ్యలపై మండిపాటు..

Amritpal Singh

Amritpal Singh

Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాది, ఇటీవల ఎంపీగా గెలిచిన అమృత్‌పాల్ సింగ్ మరోసారి ‘ఖలిస్తాన్’‌కి మద్దతుగా మాట్లాడారు. ఇటీవల తన తల్లి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తన కొడుకు ఖలిస్తానీ మద్దతుదారు కాదని, అతడిని విడుదల చేయాలని అమృత్‌పాల్ సింగ్ తల్లి కోరారు. దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కేసులో, యూఏపీఏ చట్టం కింద అస్సాం దిబ్రూగఢ్ జైలులో ఉన్న అమృత్‌పాల్ సింగ్, ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రమాణస్వీకారం కోసం నాలుగు రోజుల పెరోల్‌తో విడుదలయ్యారు.

ప్రమాణస్వీకారం చేసిన ఒక రోజు తర్వాత ఆయన తన తల్లి వ్యాఖ్యలపై మాట్లాడారు. ఖలిస్తాన్ డిమాండ్ కోసం మరోసారి నోరు విప్పారు. ‘‘ ఖల్సా రాష్ట్రం గురించి కలలు కనడం నేరం కాదు’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘‘ నిన్న మా అమ్మ ఇచ్చిన స్టేట్‌మెంగ్ గురించి తెలియగానే చాలా బాధపడ్డా.. అనుకోకుండా మా అమ్మ ఈ వ్యాఖ్యలు చేసిందని అనుకుంటున్నాను. కానీ ఇలాంటి ప్రకటన మా కుటుంబం, లేదా మద్దతు ఇచ్చే వ్యక్తుల నుంచి రాకూడదు’’ అని అన్నారు.

Read Also: Nepal: నేపాల్‌లో వరదల బీభత్సం.. 14 మంది మృతి, 9 మంది మిస్సింగ్..

‘‘ఖల్సా దేశం గురించి కలలు కనడం నేరం కాదు. అది గర్వించదగిన విషయం, లక్షలాది మంది సిక్కుల తమ జీవితాలను త్యగాం చేసిన మార్గం నుంచి వెనక్కి తగ్గడం గురించి మనం కలలో కూడా ఊహించలేము’’ అని అన్నారు. శుక్రవారం అమృత్‌పాల్ సింగ్‌తో పాటు ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘‘ఇంజనీర్ రషీద్’’ అని పిలువబడే షేక్ అబ్దుల్ రషీద్ ‌లోక్‌సభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అమృత్ పాల్ పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నుంచి, రషీద్ జమ్మూ కాశ్మీర్ బారాముల్లా నుంచి గెలుపొందారు.

2023లో అమృత్‌పాల్ సింగ్ అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. పలువురు అధికారులు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటనలో తన అరెస్టైన తన అనుచరుల్ని విడిపించుకు వెళ్లాడు. ఈ ఘటన తర్వాత పంజాబ్, కేంద్ర ప్రభుత్వాలు అమృత్‌పాల్ సింగ్‌పై కన్నెర్ర చేశాయి. ఖలిస్తానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే అనుచరుడినని చెప్పుకునే అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు నెల రోజుల పాటు వేట సాగించారు. చివరకు పంజాబ్‌లో మోగాలో గతేడాది అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతడిని అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు.