పెళ్లంటే నూరేళ్ల పంట అని.. ఏడు జన్మల బంధం అని పెద్దలు అంటుంటారు. ఇది వైవాహిక బంధానికి సంబంధించిన నానుడి. పెళ్లంటే జీవితాంతం కలిసుండే బంధం అని.. భాగస్వామ్యలిద్దరూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ కలిసుండమే పెళ్లి అని చెబుతుంటారు. అలాంటి బంధం నేటి కాలంలో మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. పెళ్లైన కొన్ని గంటలకే ఓ జంట విడాకులు తీసుకుంది. న్యాయస్థానం కూడా వారి అభ్యర్థనను మన్నించి విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.
ఇండోర్లో ఇటీవల ఓ జంటకు పెళ్లైంది. పెళ్లయ్యాక నూతన వధువు.. తాను వేరొకరిని ప్రేమించానని.. అతనితోనే జీవిస్తానని భర్తకు అసలు విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు ఒత్తిడి భరించలేక ఈ పెళ్లి చేసుకున్నట్లు కుండబద్ధలు కొట్టినట్లుగా విషయాన్ని భర్తకు తెలిపింది. దీంతో భర్త సానుకూలంగా స్పందించాడు. దంపతుల పరస్పర అంగీకారంతో కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పెళ్లైన మూడు, నాలుగు రోజుల్లోనే ఫ్యామిలీ కోర్టును కోరారు.
భార్యాభర్తలు కలిసి జీవించడానికి ఇష్టపడటం లేదని న్యాయవాది వర్షా గుప్తా న్యాయస్థానానికి తెలిపారు. విచారణ సందర్భంగా హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13-బి ప్రకారం ఒక సంవత్సరం పాటు విడిగా జీవించాలనే షరతు కోర్టు లేవనెత్తింది. ఈ షరతు నెరవేరకుండా విడాకుల పిటిషన్ అసలు చెల్లుబాటు కాదని గుర్తుచేసింది. దీనికి న్యాయవాది బదులిస్తూ… హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 14(2) కింద దరఖాస్తు ఉనికిలో లేని వివాహంలో భార్యాభర్తలను కలిసి జీవించమని బలవంతం చేయరాదని సుప్రీం కోర్టు తన ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొందని గుర్తుచేశారు. వారి సమయం, జీవితాలు ప్రభావితం కాకుండా చూసుకోవడానికి వారిని వేరుగా ఉంచడమే సముచితమని ధర్మాసనం దృష్టికి న్యాయవాది తీసుకెళ్లారు. దీంతో విచారణ సందర్భంగా దంపతులు విడిపోవడానికి అంగీకరించగా.. కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో 168 గంటల్లోనే అనగా ఏడు రోజుల్లో నూతన దంపతులకు విడాకులు మంజూరు అయ్యాయి.

