Site icon NTV Telugu

IndiGo: ఇరాన్ వార్ ఎఫెక్ట్.. పెరిగిన ఇండిగో టికెట్ ధరలు..

Indigo

Indigo

IndiGo: మధ్యప్రాచ్యంలోని ఇరాన్ యుద్ధ ప్రభావం దేశ విమానయాన రంగంపై పడింది. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో, టికెట్లపై ‘‘ఫ్యూయల్ సర్‌చార్జ్’’ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు మార్చి 14 అర్థరాత్రి 12 నుంచి అమలులోకి వస్తాయని సంస్థ తెలిపింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీని వల్ల విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధరలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తన టికెట్లపై అదనపు ఫ్యూయర్ సర్‌ఛార్జ్ విధిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ విడుదల చేసిన జెట్ ఫ్యూయల్ మానిటర్ ప్రకారం.. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో విమాన ఇంధన ధరలు 85 శాతం కన్నా ఎక్కువ పెరిగాయి. విమానయాన సంస్థల మొత్తం వ్యయాల్లో ఏటీఎఫ్ భాగమే ఎక్కువ కావడంతో, ఈ పెరుగుదల కంపెనీలపై పెను భారాన్ని చూపుతుంది. ప్రస్తుతం, ఇండిగో టికెట్‌ పై ప్రతీ ప్రయాణికుడు అదనపు ఫ్యూయల్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.

Read Also: Fuel Gases: LPG, CNG, PNG మధ్య తేడాలు ఏంటి.. వీటిని ఏ విధంగా ఉపయోగిస్తారు..?

కొత్త బుకింగ్స్‌పై ప్రతీ ప్రయాణికుడు సెక్టార్ల వారీగా అదనపు ఫ్యూయల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. భారత్‌లో దేశీయ విమానాలకు రూ. 425, ఇండిన్ సబ్ కాంటినెంట్ రూ. 425, మిడిల్ ఈస్ట్ రూ. 900, దక్షిణాసియా మరియు చైనా రూ. 1800, ఆఫ్రికా మరియు వెస్ట్ ఆసియా రూ. 1800, యూరప్ రూ. 2300 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇంధన ధరల పెరుగుదల వల్ల టికెట్ ధరలను భారీగా పెంచాల్సి వస్తుందని, అయితే ప్రయాణికులపై అధిక భారం పడకుండా తక్కువ మొత్తంలోనే ఫ్యూయల్ సర్‌చార్జ్ విధించామని ఇండిగో తెలిపింది. అదనపు ఛార్జీల వల్ల ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతూ.. ప్రస్తుత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకున్నామని, భవిష్యత్తులో పరిస్థితులను బట్టి మార్పులు చేస్తామని సంస్థ ప్రకటించింది.

Exit mobile version