India GDP: భారత ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా దూసుకెళ్తోంది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని విధంగా పరుగులు తీస్తోంది. కేవలం దశాబ్ద కాలంలోనే భారత జీడీపి ఏకంగా 105 శాతం పెరిగింది. భారతదేశం తన స్థూల దేశీయోత్పత్తి (GDP)ని 2015లో $2.1 ట్రిలియన్ల నుండి 2025 నాటికి $4.3 ట్రిలియన్లకు రెట్టింపు అయింది. ఇలాంటి రికార్డ్ ఏ దేశానికి కూడా లేదు. కేవలం పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ డబుల్ అయింది.
అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) డేటా ప్రకారం.. భారతదేశం దశాబ్దంలో 77 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసింది. ఈ వేగవంతమైన పురోగతి భారత్ని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేసింది. ఇదే వేగంతో కొనసాగితే 2025 నాటికి జపాన్, 2027 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉంది. ఈ రెండు దేశాలను అధిగమిస్తే అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, చైనా కూడా ఇదే కాలానికి 74 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసింది. 2015లో $11.2 ట్రిలియన్ల నుండి 2025లో $19.5 ట్రిలియన్లకు పెరిగింది. మరోవైపు, యూరప్ దేశాలు జీడీపీ వృద్ధిరేటులో పడిపోయాయి. 2015-2025 కాలంలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వృద్ధి రేటు కేవలం 6 నుంచి 14 శాతమే ఉంది. కోవిడ్ పరిణామాలు, ఉక్రెయిన్ యుద్ధం వంటికి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ప్రస్తుతం భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే, అమెరికా ($30.3 ట్రిలియన్), చైనా ($19.5 ట్రిలియన్), జర్మనీ ($4.9 ట్రిలియన్) ,జపాన్ ($4.4 ట్రిలియన్) ముందు స్థానాల్లో ఉన్నాయి.