India Slams China: ‘‘ముందు వాస్తవాలు తెలుసుకో’’.. చైనా మీడియాకు భారత్ చురకలు..

  • ‘‘ముందు వాస్తవాలను నిర్ధారించుకో’’..
  • చైనా మీడియాపై భారత్ ఆగ్రహం..
  • ఆపరేషన్ సిందూర్‌పై అబద్ధపు కథనాలు..
India China

India China

India Slams China: పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణి దాడుల నేపథ్యంలో, చైనా స్టేట్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఈ రోజు తెల్లవారుజామున ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహించింది. పీఓకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్ర కేంద్రాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌కి చెందిన 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు.

Read Also: Rajnath Singh: “వారే మా టార్గెట్” రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

అయితే, పాకిస్తాన్ తో పాటు దాని మిత్రదేశం చైనా అబద్ధపు వార్తల్ని ప్రచారంలోకి తెస్తోంది. చైనా స్టేట్ మీడియా గ్లోబల్ టైమ్స్ తప్పుడు కథనాన్ని వ్యాప్తి చేస్తుందని భారత్ తీవ్రంగా విమర్శించింది. కూలిపోయిన పాత విమాన చిత్రాలను ఉపయోగించి గ్లోబల్ టైమ్స్ ఒక నివేదికను ప్రచురించింది. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ భారత ఫైటర్ జెట్‌ని కూల్చేసిందని తప్పుడు ప్రచారం చేసింది.

దీనిపై భారత్ చైనాకు చురకలు అంటించింది. ‘‘ప్రియమైన గ్లోబల్ టైమ్స్, ఈ రకమైన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే ముందు మీరు వాస్తవాలను ధృవీకరించాలని, మీ మూలాలను క్రాస్ ఎగ్జామినేట్ చేయాలని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము’’ అని చైనా లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ పోస్టులో తెలిపింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తానీ అనుకూల హ్యాండిల్స్ ప్రజల్ని తప్పుదోవ పట్టించే అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నాయి.