NTV Telugu Site icon

UNESCO: “హొయసల” ఆలయాలకు యునెస్కో గుర్తింపు.. 42కి చేరిన యునెస్కో వారసత్వ గుర్తింపు

Unesco

Unesco

UNESCO: యునెస్కో(UNESCO) ప్రపంచ వారతసత్వ సంపదలో మరో రెండు భారతీయ ప్రదేశాలకు చోటు లభించింది. దీంతో భారత్ నుంచి ఈ జాబితాలో వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశాల సంఖ్య 42కి చేరింది. కర్ణాటక హొయసల రాజవంశానికి చెందిన ఆలయాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అంతకుముందు రోజు పశ్చిమబెంగాల్ రవీంద్రనాథ్ ఠాగూర్ ‘శాంతినికేతన్’ని వారసత్వ సంపదగా గుర్తించింది యునెస్కో(UNESCO). ఈ విషయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) తెలిపింది.

Read Also: Chicken Shawarma: బాలిక ప్రాణం తీసిన ‘చికెన్ షావర్మా’

సౌదీ అరేబియాలో జరుగుతున్న 45వ ‘వరల్డ్ హెరితటేజ్ కమిటీ’లో ఈ నిర్ణయం తీసుకున్నారు. హొయసల ఆలయాలు 2014 ఏప్రిల్ 15 నుంచే యునెస్కో పరిశీలన జాబితాలో ఉన్నాయి. 13వ శతాబ్ధపు వాస్తుశిల్ప కళను కలిగిన హొయసల బేలూరులోని చెన్నకేశ ఆలయం, హళీబేడు లోని హోయసలేశ్వర ఆలయం, సోమనాథపురలోని కేశవ ఆలయం యునెస్కో వారసత్వ ప్రాంతాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ ఆలయాల నిర్మాణంలో నగర, భూమిజ, ద్రవిడ శైలులు కనిపిస్తాయి. ఇటలీ, స్పెయిన్, జర్మనీ, చైనా, ఫ్రాన్స్ దేశాల తరువాత అత్యధిక యునెస్కో వారసత్వ ప్రాంతాలు కలిగిన ఆరో పెద్ద దేశంగా ఇండియా నిలిచింది.

హొయసల ఆయలయాలకు ఈ గౌరవం దక్కడంపై ప్రధాని నరేంద్రమోడీ ఆనందం వ్యక్తం చేశారు. యునెన్కో ప్రపంచ వారసత్వ జాబితాలో హొయసలకు చోటు లభించడం భారత్ కు ఎంతో గర్వకారణమని, ఆలయాలపై సమాచారం, అద్భుతమైన శిల్పకళ భారత సాంస్కృతిక వారసత్వం, పూర్వీకుల కళా నైపుణ్యానికి నిదర్శనం అని ట్వీట్ చేశారు.