India Missile Test: భారత్ తన రక్షణ, వ్యూహాత్మక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా మరో కీలక అడుగు వేస్తోంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO), స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి మరో కీలక క్షిపణి పరీక్షకు సన్నాహాలు జరుగుతోంది. ఇందుకోసం బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుమారు 2,995 కిలోమీటర్ల పరిధికి సంబంధించిన NOTAM (Notice to Airmen)ను అధికారులు జారీ చేశారు.
సెప్టెంబర్ 2, 3 తేదీల్లో పరీక్ష..
తాజా నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఈ క్షిపణి పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరీక్ష సమయంలో విమానాలు, సముద్ర కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా నిర్దిష్ట ప్రాంతాన్ని నో-ఫ్లై జోన్గా ప్రకటించడంతో పాటు సముద్రంలో డేంజర్ కారిడార్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. NOTAMలో పేర్కొన్న ప్రాంతం దాదాపు 2,995 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండటం ఇప్పుడు ప్రపంచ రక్షణ రంగంలో ఆసక్తిని పెంచుతోంది.
ఏ క్షిపణిని పరీక్షించనున్నారంటే..
అయితే ఈ పరీక్షలో ఏ క్షిపణిని ప్రయోగించనున్నారనే విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ, DRDO అధికారికంగా వెల్లడించలేదు. అయితే రక్షణ రంగ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పరిధి అగ్ని సిరీస్కు చెందిన ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లలో ఒకటైన అగ్ని-3 లేదా అగ్ని-4 పరీక్షకు సంబంధించినదై ఉండొచ్చని అంటున్నారు. అదే సమయంలో తదుపరి తరం అత్యాధునిక క్షిపణిగా ప్రచారంలో ఉన్న అగ్ని-6కు సంబంధించిన పరీక్ష లేదా దాని కీలక భాగాల ట్రయల్ కూడా జరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అయితే దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదు. భారత్ ఇప్పటికే అగ్ని సిరీస్లోని పలు క్షిపణులను విజయవంతంగా అభివృద్ధి చేసి, పరీక్షించింది. దేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో ఈ క్షిపణులు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
తాజాగా 2,995 కిలోమీటర్ల పరిధిలో NOTAM జారీ కావడంతో భారత్ మరో కీలక పరీక్షకు రంగం సిద్ధమవుతోందనే ఊహాగానాలు శత్రు దేశాలతో పాటు ప్రపంచ దేశాల్లో ఊపందుకున్నాయి. మరోవైపు ఈ పరీక్షకు సంబంధించిన క్షిపణి పేరు, దాని సామర్థ్యాలు, ప్రయోగ లక్ష్యాలపై అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ పరీక్ష సక్సెస్ అయితే భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత, వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇది మరో ముందడుగుగా నిలిచే అవకాశం ఉందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.

