Site icon NTV Telugu

Pak-Afghan war: పిరికిపంద.. అమానుష దాడి.. పాక్ ఘాతుకాన్ని ఖండించిన భారత్

Pakafghan War

Pakafghan War

ఆప్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ ఘాతుకానికి పాల్పడింది. సోమవారం రాత్రి కాబూల్‌లోని ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 408 మంది మరణించిగా.. వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటన ప్రపంచ దేశాలు ఉలిక్కిపడేలా చేసింది.

పాకిస్థాన్ చర్యను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఇది పిరికిపంద చర్యగా.. అమానుష దాడిగా అభివర్ణించింది. ఇది హేయమైన.. దురాక్రమణ చర్యగా పేర్కొంది. ఇది కచ్చితంగా ఆప్ఘనిస్థాన్ సార్వభౌమాధికారంపై జరిగిన దారుణమైన దాడిగా తెలిపింది. ఇది ప్రాంతీయ శాంతికి విఘాతం కలిగించిందని భారత్ ధ్వజమెత్తింది.

ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం శాంతి, కరుణతో గడిపే పవిత్ర రంజాన్ మాసంలో పాకిస్థాన్ ఇలాంటి దాడి చేయడం హేయమైన చర్యగా భారత్ అభివర్ణించింది. ఒక ఆస్పత్రిని.. రోగులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఏ మతమూ.. ఏ చట్టమూ సమర్థించదని పేర్కొంది. ఈ నేరపూరిత చర్యను అంతర్జాతీయ సమాజం ఖండించాలని.. పాకిస్థాన్ ఘాతుకం ఆగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విపత్కర సమయంలో ఆప్ఘని ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భారత్ ఆకాంక్షించింది.

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి సుమారు 9 గంటలకు కాబూల్‌లోని ఆస్పత్రిపై వైమానిక దాడి జరిగిందని.. ఈ దాడిలో 2,000 పడకల ఆస్పత్రిలోని చాలా భాగాలు ధ్వంసమయ్యాయని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ ఉప అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిట్రాత్ తెలిపారు. 400లకు పైగా చనిపోయారని.. సుమారు 250 మంది గాయపడినట్లు సమాచారం అందిందని తెలిపారు.

Exit mobile version