Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..

  • బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారత్‌దే బాధ్యత.
  • జపాన్ మాజీ మంత్రి ఆరోపణ.
  • భారత అధికారులు హామీలు నిలబెట్టుకోరని తీవ్ర విమర్శ.
  • ఆరోపణలను ఖండించిన కేంద్రం.
Bullet Train

Bullet Train

Bullet Train: భారత్ తొలి ‘‘బుల్లెట్ ట్రైన్’’ ప్రాజెక్టుపై జపాన్ మాజీ న్యాయశాఖ మంత్రి హిడేకి మకిహారా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్‌ వేదికగా స్పందించిన ఆయన.. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఆలస్యానికి పూర్తిగా బాధ్యత భారత్‌దే అని అన్నారు. భారత అధికారులతో జరిగిన అంతర్జాతీయ సమావేశాల్లో వారిలో నిర్లక్ష్యం పదే పదే కనిపించిందని, వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, వారి సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని మకిహారా అన్నారు. జపాన్ తరుపున చెప్పాలంటే, ఈ ప్రాజెక్టు ముందుకు సాగకపోవడానికి 100 శాతం భారత పక్షమే కారణమని అన్నారు. జపాన్ ప్రధాని సనాయే తకైచి ఇటీవల భారత్‌లో పర్యటించినప్పటికీ ఈ ప్రాజెక్టులో వేగం కనిపించడం లేదని చెప్పారు. టోక్యోకు చెందిన ‘టోయో కేజాయ్ ఆన్‌లైన్’లో సీనియర్ రైల్వే ఇంజనీర్ ఇసావో సుజిమురా రాసిన వ్యాసానికి స్పందిస్తూ మకిహారా ఈ వ్యాఖ్యలు చేశారు. షింకన్‌సెన్ అసలు నమూనా నుంచి భారత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు దూరమైందని సుజిమురా తన వ్యాసంలో పేర్కొన్నారు.

తోసిపుచ్చిన భారత్:

అయితే, ఈ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. భారత్-జపాన్ మధ్య ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని, నిర్మాణ పనులు గతంలో కన్నా వేగంగా జరుగుతున్నాయని, అనేక కీలక నిర్మాణ మైలురాళ్లు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పింది. ప్రాజెక్టు నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతోందని చెప్పారు. జపాన్ అభివృద్ధి చేస్తున్న కొత్త తరం E10 షింకాన్‌సెన్ రైళ్లు 2030ల ప్రారంభంలో అందుబాటులోకి వస్తాయని, అప్పటి వరకు భారత హైస్పీడ్ రైళ్లతో సేవలు ప్రారంభించాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కాంగ్రెస్ విమర్శలు:

జపాన్ మాజీ మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ బీజేపీని విమర్శించింది. కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా మాట్లాడుతూ.. భారత్-జపాన్ షింకాన్‌సెన్ ప్రాజెక్టులో నేరుగా పాల్గొన్న మాజీ జపాన్ మత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రధాని సనాయే తకైచి భారత్ పర్యటన తర్వాత కూడా ప్రాజెక్ట్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదని, సిగ్నలింగ్ వ్యవస్థల్లో జపాన్‌ను పక్కన పెట్టారని ఆయన చెప్పడం ఆందోళనకరం అని అన్నారు.

ప్రాజెక్ట్ వివరాలు:

ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టు కొనసాగుతోంది. ఇది భారత్-జపాన్ వ్యూహాత్మక మౌలిక సదుపాయాల భాగస్వామ్యంలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. దీని మొత్తం పొడవు 508 కిలోమీటర్లు. మొత్తం స్టేషన్లు 12. గరిష్ట ఆపరేటింగ్ స్పీడ్ గంటకు 320 కిలోమీటర్లు. ప్రస్తుతం రెండు నగరాల మధ్య ఉన్న 8 గంటల ప్రయాణం బుల్లెట్ రైలు వల్ల 2 గంటలకు తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు 2023 నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ మహారాష్ట్ర రాజకీయాలు, భూసేకరణ సమస్యల కారణంగా జాప్యం జరిగింది. మొదటి దశలో సూరత్-బిలిమోరా మధ్య 2027 ఆగస్టు 15 నుంచి సేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.