INDI Alliance: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో సంచలన ఫలితాలు విడుదలయ్యాయి. బెంగాల్ను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అస్సాంలో ఏక పక్షంగా బీజేపీ విజయం సాధిస్తోంది. పుదుచ్చేరిలో ఎన్డీయే అధికారంలోకి రాబోతోంది. కేరళలో మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారం చేపట్టబోతోంది. తమిళనాడులో 40 ఏళ్లుగా సాగుతున్న డీఎంకే, అన్నాడీఎంకేల పాలనకు రెండేళ్ల వ్యవధిలోనే విజయ్ టీవీకే బిగ్ షాక్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే, ఈ మొత్తం రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే ఇండియా కూటమి కూలిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇండియ కూటమిలో ప్రధాన పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలు చిత్తుగా ఓడిపోయాయి. 2029 లోక్సభ ఎన్నికల వరకు మళ్లీ ఇండియా కూటమి ఉంటుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే పార్టీలు కూటమికిగా బీజేపీని ఎదుర్కొనేందుకు పోటీ చేశాయి. అయితే, ఈ ప్రయత్నంలో కొంత మేర సక్సెస్ అయ్యాయి. బీజేపీ నేరుగా అధికారాన్ని చేపట్టేంత సీట్లు దక్కించుకోలేకపోయింది. మిత్రపక్షాల మద్దతుతో అధికారాన్ని ఏర్పాటు చేసింది.
Read Also: Vijay Emerges as King: అందరూ కింగ్మేకర్ అన్నారు.. విజయే ‘కింగ్’ అవుతాడని చెప్పింది ఆ ఒక్కడే..
అయితే, దీని తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ బంపర్ విక్టరీ సాధించుకుంటూ వస్తోంది. హర్యానా, మహారాష్ట్ర, బీహార్లో ఘన విజయాలు సాధించింది. ఎన్డీయే కూటమిగా బీజేపీ సత్తా చూటుతోంది. అన్నింటి కన్నా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని అధికారం నుంచి దించడం బీజేపీ సత్తాను మరోసారి పరిచయం చేసింది. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ విషయాలపై స్పందిస్తూ.. 2029 వరకు ఈ విజయాలను గుర్తుంచుకుంటారని చెప్పడం చూస్తే, ఈ విజయాల ప్రభావం ఎలాంటిదో అర్థం అవుతుంది.
హిందీ, హిందూ వ్యతిరేక భావజాలం కూడా చాలా రోజులు పనిచేయదనే విషయం డీఎంకే కూడా గుర్తుంచుకోవాల్సిన సమయం వచ్చింది. మైనారిటీ సంతుష్టీకరణ అన్ని వేళల్లో కుదరదని బెంగాల్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ఒక ఉదాహరణ ఇచ్చాయి. ఇదే విధంగా తమిళనాడులో డీఎంకే నేతల హిందూ వ్యతిరేక విధానాలు, వ్యాఖ్యలు కూడా ఓటమికి కారణమయ్యాయి. డీఎంకేపై ఉన్న వ్యతిరేకత టీవీకేకు వరంగా మారింది. దీంతో నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న డీఎంకే ఇప్పుడు మూడో స్థానానికి పరిమితమైంది.
ఈ మొత్తం పరిణామాలు చూస్తే ఇండియా కూటమి కూలిపోతున్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఎన్నికల విజయం రాబోయే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ అధికారానికి దూరమై 10 ఏళ్లు అవుతోంది. ఇక బీహార్లో ఆర్జేడీ తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ కూడా అనుకున్నంతగా ప్రభావం చూపించలేకపోతోంది.
